కరీంనగర్ కార్పొరేషన్: జనగణన 2027లో భాగంగా ఈ నెల 26వ తేదీ నుంచి నగరప్రజలు స్వీయ లెక్కింపు (సెల్ఫ్ ఎన్యుమరేషన్) చేసుకోవచ్చని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి దశలో గృహ లెక్కింపు, గృహ పరిస్థితుల లెక్కింపు మే 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు నిర్వహిస్తున్నామన్నారు. అంతకుముందే ప్రజల సౌలభ్యం కోసం స్వీయ లెక్కింపు సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ఆన్లైన్లో ఈ నెల 26వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు. వివరాలు నమోదు పూర్తయిన తరువాత ఒక యూనిక్ కోడ్ వస్తుందని, ఆ కోడ్ను సంబంధిత ఎన్యుమరేటర్కు చూపించాలన్నారు.
ఎస్ఐఆర్ను పారదర్శకంగా చేపట్టాలి
ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పారదర్శకంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఓటరు జాబితా సమగ్ర సవరణ) ప్రక్రియ చేపట్టాలని కమిషనర్ ప్రఫుల్దేశాయ్ ఆదేశించారు. శుక్రవారం పలు డివి జన్ల పరిధిలో జరుగుతున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పర్యవేక్షించారు. బీఎల్వోలు, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, పేర్ల సవరణలతో పాటు మరణించిన, వలస వెళ్లిన వారి పేర్ల తొలగింపు తదితర వివరాలను అడిగి తెలుసుకొన్నారు. ఒకే వ్యక్తి రెండు చోట్ల, పక్కపక్క డివిజన్లలో ఓటు హక్కు ఉన్నట్లు గుర్తిస్తే, క్షేత్రస్థాయి విచారణ జరిపి నిబంధనల ప్రకారం తొలగించాలన్నారు.
తాగునీటి సరఫరాలో ఇబ్బందులు రావొద్దు
నగర ప్రజలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. శుక్రవారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మానేరుడ్యాం సమీపంలోని బూస్టర్ పంపులను సందర్శించారు. అమృత్ 2.0 పథకంలో భాగంగా నూతనంగా నిర్మాణం చేస్తున్న రా వాటర్ సంపు, రిజర్వాయర్ అభివృద్ధి పనులను తనిఖీచేశారు. డీఈ దేవేందర్ అధికారులున్నారు.


