ధర్మపురి: మండలంలోని రాజారం గ్రామానికి చెందిన గుర్రాల మమత, గంగాధర్ దంపతులు శుక్రవారం పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రమాదవశాత్తు గుడిసెకు నిప్పంటుకొని మంటలు చెలరేగాయి. గ్రామస్తులు ఫైరింజన్కు ఫోన్ చేయగా అది చేరుకునేలోగా గుడిసె పూర్తిగా దగ్ధమైంది. రూ.25 వేల నగదు, పట్టాదారు పాసు పుస్తకాలు, సుమారు రూ.లక్ష విలువ గల వస్తువులు కాలి బూడిదైనట్లు బాధితులు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
ప్రముఖ గాయకుడు శంకర్శర్మ మృతి
ధర్మపురి: ప్రముఖ గాయకుడు, తెలంగాణ ఘంటశాలగా ప్రసిద్ధి చెందిన రిటైర్డ్ టీచర్ గుండి శంకర్శర్మ (72) మృతిచెందారు. ధర్మపురికి చెందిన గుండి శంకర్శర్మ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా 2013లో రిటైర్డ్ అయ్యారు. 10 రోజుల క్రితం గుండెనొప్పి రాగా వైద్యులు స్టంట్ వేశారు. శుక్రవారం వేకువజామున మరోసారి గుండెనొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించేలోగా మృతిచెందారు. ఆయన మృతిపై ఉపాధ్యాయ సంఘాలు, గాయకులు, కవులు, కళాకారులు సానుభూతి తెలిపారు.


