వీరు రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం శాంతి నగర్కు చెందిన గుగులోతు గోపాల్ కుటుంబ సభ్యులు. అప్పుల బాధ భరించలేక గత మార్చి 21న తన పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని మరణించాడు. ఇప్పుడు వారి కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. ఇద్దరు బిడ్డలు, కొడుకు, భార్య నిర్మల ఏం చేయాలో తెలియడం లేదు. ఆ ఇల్లాలికి పిల్లలను ఎట్ల పెంచుకోవాలో తెలియక భర్త జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తీవ్ర మనోవేదనకు గురవుతోంది.
అమ్మానాన్న.. ఇద్దరు ఉంటేనే పిల్లలకు తోడునీడ. కుటుంబానికి భరోసా. స్కూల్ నుంచి వస్తుండగా అమ్మ ఎదురుగా రాకపోతే ఆ చిన్నారుల ఆందోళనకు అంతుండదు. అదే శాశ్వతంగా కనిపించకుండా పోతే ఆ గుండె లయతప్పుతుంది. సాయంత్రానికి నాన్న కనిపించకపోతే పిల్లల ఆతృత పెరిగిపోతుంది. అదే నాన్న ఇక కనిపించబోడు అని తెలిస్తే కళ్ల ముందు అంధకా రం నిండిపోతుంది. ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు కుటుంబాలను రోడ్డు పాలు చేస్తున్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో ఇటీవల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. పలువురు బాధిత చిన్నారులు పడుతున్న ఆవేదనను ‘సాక్షి’ అక్షరీకరించింది.
– వీర్నపల్లి(సిరిసిల్ల)
నాన్న.. నీవే నా ధైర్యం అనుకున్న
నాన్న.. నేను స్కూల్ నుంచి రాగానే ప్రతి రోజూ నా కోసం ఎదురుచూసే వాడివి. ఇప్పుడు నువ్వు కనిపించడం లేదు. నువ్వు ఉన్నావనే ధైర్యంతో అందరితో నవ్వుతూ తిరిగేవాడిని. ఇప్పుడు నా వెనుక నువ్వు లేవని తెలిసి కన్నీళ్లు ఆగడం లేదు. మా నాన్న లాగా క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి. పిల్లలను అనాథలుగా చేయకండి. మమ్మల్ని వదిలి వెళ్లిపోకండి. దయచేసి ప్రాణాలు తీసుకోవద్దు.
– జంగునాయక్, శాంతినగర్(గుగులోత్ గోపాల్ కొడుకు)


