కొత్తపల్లి/చిగురుమామిడి: వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. కొత్తపల్లి మండలం మల్కాపూర్, చిగురుమామిడి మండలం పీచుపల్లి, లంబాడిపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆర్డీవో మహేశ్వర్, పౌర సరఫరాల శాఖ అధికారి నర్సింగరావు, డీఎం రజనీకాంత్తో కలిసి పరిశీలించారు. అన్ని కేంద్రాల్లో తూకం, తేమయంత్రాలు సరిగా పనిచేసేలా చూడాలన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం, సాయంత్రం కొనుగోళ్లు చేపట్టాలని సూచించారు. మెడికల్ కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఏఎన్ఎం సేవలు అందుబాటులో ఉండాలన్నారు. అకాల వర్షాలతో నష్టం వాటిల్లకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లను మండల అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. ఈ సందర్భంగా ధాన్యం కుప్పలు, తేమ శాతం, రికార్డులు, సౌకర్యాలను పరిశీలించి అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, తహసీల్దార్ ముద్దసాని రమేశ్, ఎంపీడీవో విజయ్కుమార్, ఆయా గ్రామాల సర్పంచులు కాటం సంపత్రెడ్డి, పీచు సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


