వడదెబ్బతో వలస కూలీ మృతి | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో వలస కూలీ మృతి

Apr 23 2026 7:54 AM | Updated on Apr 23 2026 7:54 AM

ధర్మపురి: జీవనోపాధి కోసం వలస వచ్చిన కూలీ వడదెబ్బ తగిలిమృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం బాపట్ల జిల్లా చీరాల ప్రాంతానికి చెందిన యోహన్‌ అలియాస్‌ మహేష్‌ (28) కూలీ పనుల కోసం ధర్మపురి వచ్చాడు. మండలంలోని కమలాపూర్‌లో బుధవారం అతిగా మద్యం సేవించాడు. వడదెబ్బకు గురై మృతి చెందాడు. సీఐ రాంనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై మహేష్‌ సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

గంజాయి విక్రేత అరెస్ట్‌

ధర్మపురి:గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండుకు పంపినట్లు ఎస్సై మహేష్‌ తెలిపారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన ప్రణీత్‌కుమార్‌ గంజాయికి అలవాటు పడ్డాడు. పైగా విక్రయించేందుకు సిద్ధమయ్యారు. పట్టణంలోని పెట్రోల్‌ పంప్‌ వద్ద అనుమానాస్పదంగా వెళ్తుండడంతో పోలీసులు సోదా చేయగా అతని వద్ద 60 గ్రాముల గంజాయి లభించింది. గంజాయిని సీజ్‌ చేసి యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్సై తెలిపారు.

ముగ్గురికి జైలు

కరీంనగర్‌క్రైం: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ముగ్గురికి కరీంనగర్‌ కోర్టు 4 రోజుల జైలు శిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు. మొగ్గ ప్రశాంత్‌, బోయిని గంగరాజు, భానోతు జయరాంకు సాధారణ జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.

మహిళ ఆత్మహత్యాయత్నం

కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌కు చెందిన ఓ మహిళ కుటుంబ గొడవలతో విసిగిపోయి ఆత్మహత్య చేసుకుంటానని పద్మనగర్లోని వాటర్‌ ట్యాంక్‌ ఎక్కింది. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే పోలీస్‌, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారమందించారు. వెంటనే స్పందించిన టూటౌన్‌ సీఐ సృజన్‌రెడ్డి, డివిజన్‌ ఫైర్‌ అధికారి శ్రీనివాస్‌రెడ్డి సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి మహిళకు నచ్చజెప్పి కిందకు తీసుకొచ్చారు. భార్యాభర్తలకు కౌన్సెలింగ్‌ ఇచ్చి ఇంటికి పంపించారు.

గుడుంబా విక్రేతలపై కేసు

వీర్నపల్లి: మండలంలోని భావుసింగ్‌నాయక్‌ తండా గ్రామపంచాయతీ పరిధిలోని గొన్యనాయక్‌తండాలో గుడుంబా స్థావరాలపై పోలీ సులు బుధవారం దాడి చేశారు. గుడుంబా విక్రయిస్తున్న ఇద్దరు పట్టుబడ్డట్లు ఎస్సై లక్ష్మణ్‌ తెలిపారు. గుడుంబా తయారీ కోసం నిల్వ ఉంచిన సుమారు 100 లీటర్ల బెల్లం, సారాయికి ఉపయోగించే ముడి పదార్థాలను ధ్వంసం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement