కరీంనగర్: మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్, ఇండియా కూటమి వ్యవహరించిన తీరును నిరసిస్తూ కరీంనగర్ బీజేపీ శ్రేణులు నగరంలోని తెలంగాణ చౌక్లో నిరసన చేపట్టారు. కాంగ్రెస్, ఇండియా కూటమికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ సునీల్ కుమార్ పార్లమెంటులో కాంగ్రెస్, ఇండియా కూటమి మహిళా బిల్లును వ్యతిరేకించిన విధానంపై మండిపడ్డారు. మహిళా లోకానికి, దేశానికి ఏప్రిల్ 17 బ్లాక్ డేగా అభివర్ణించారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తామంటే హర్షించాల్సిన ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేసి బిల్లును అడ్డుకొని వీగిపోయేలా చేయడం సరికాదన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయని మండిపడ్డారు. తప్పకుండా శిక్ష అనుభవిస్తాయని, మహిళలకు ఆ పార్టీలు సమాధానం చెప్పాలన్నారు.


