పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం అందుగులపల్లిలో శనివారం పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న రెండేళ్ల వయస్సు గల తోడెంగుల నిహాన్స్తో పాటు కొయ్యడ ఓదెలు, నారాయణపై దాడి చేసి గాయపర్చాయి. గాయపడిన వారిని పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గ్రామంలో పిచ్చికుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని సర్పంచ్ అంజయ్య, ఉపసర్పంచ్ తలారి స్వప్న తెలిపారు.
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
మెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలం కోనరావుపేటలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో చోరీ జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన కొడిదల లాస్య మూడు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి తల్లిగారింటికి వెళ్లింది. శనివారం వచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉండడాన్ని గమనించింది. విషయాన్ని సర్పంచ్ గంగారెడ్డి, ఉపసర్పంచ్ పరందాములు దృష్టికి తీసుకెళ్లగా వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు. విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


