వీణవంక: జల్సాలకు, తాగుడుకు బానిసై ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను ఆరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జమ్మికుంట సీఐ లక్ష్మినారాయణ, ఎస్సై ఆవుల తిరుపతి వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లాకు చెందిన కుంటాల భీమయ్య(40), మడక నరసయ్య అలియాస్ చిరంజీవి కలిసి ఆలయాలను టార్గెట్ చేసుకొని రాత్రి వేళలో చోరీలకు పాల్పడేవారు. వీణవంక మండలం ఎల్బాక– గంగారం గ్రామాల మధ్య ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయం, కొండపాకలోని రేణుక ఎల్ల మ్మ , పెద్దమ్మ తల్లి ఆలయాల్లో తాళాలను పగలగొట్టి ఇటీవల చోరీలకు పాల్పడ్డారు. గుడి వద్ద బీమయ్య కాపలా ఉండగా నర్సయ్య గుడి లోపలికి వెళ్లి దొంగతనం చేసేవాడు. దొంగలించిన సొమ్మును జల్సాలకు, తాగుడుకు ఖర్చు పెట్టేవారు.ఈ నెల 16న రెడ్డిపల్లి శివారులో అనుమానస్పదంగా తిరుగుతుండగా భీమయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించగా ఆలయాల్లో చోరీలకు పాల్పడినట్లు ఓప్పుకున్నాడు. అతని వద్ద రూ.వెయ్యి స్వాధీనం చేసుకొన్నామని, నర్సయ్య పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు.


