కరీంనగర్ కార్పొరేషన్: వేసవిలో తాగునీటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. గురువారం 48వ డివిజన్ శ్రీహరినగర్లో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.10 లక్షలతో చేపట్టనున్న తాగునీటి పైప్లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఇటీవలే నగరపాలక సంస్థ ఫిల్టర్బెడ్తో పాటు, బూస్టర్ పంపులు, ఇన్ టెక్వెల్ను తనిఖీ చేసినట్లు తెలిపారు. నీటి సరఫరాలో ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించామన్నారు. ఎల్ఎండీలో ప్రస్తుతం 6 టీఎంసీల నీటి సామర్థ్యం ఉందని, 10 టీఎంసీల నీటి సామర్థ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని నీటిపారుదలశాఖ, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా కోరామన్నారు. ప్రస్తుతం ప్రజలకు రోజు విడిచి రోజు నీటి సరఫరా చేస్తున్నామని, ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు మూడు భూస్టర్ పంపులను రన్ చేస్తున్నామన్నారు. కార్పొరేటర్లు కర్రె పద్మ అనిల్, ఎన్నం లక్ష్మి ప్రకాశ్, బండ రమణారెడ్డి, గాజ రమ శివరాం, డీఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.


