కరీంనగర్ అర్బన్: ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక సమావేశాలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. ఈ నెల16న మండలస్థాయిలో జరిగే సమావేశాల నేపథ్యంలో బుధవారం జిల్లాస్థాయి అధికారులతో పాటు ఎంపీడీవోలు, ఎంఈఓలు, ఎంపీవోలతో సమీక్ష నిర్వహించి, పలు సూచనలు చేశారు. రైతు భరోసా, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, మహిళలకు రుణాలు, కార్పొరేషన్ల ద్వారా అందించిన రుణాలు, మహాలక్ష్మి పథకం, సన్నబియ్యం పంపిణీ వంటి అంశాలపై ప్రత్యేకంగా వివరించాలన్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రోడ్డు భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములుగా చేయాలని, ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించాలని సూచించారు. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, డీపీవో జగదీశ్వర్, ఇన్చార్జి సీపీవో రామ్ దత్తారెడ్డి, డీఎంహెచ్వో వెంకటరమణ, జెడ్పీ సీఈవో శ్రీనివాస్, డీఎస్ వో నర్సింగరావు, డీఆర్డీవో శ్రీధర్, సంక్షేమ అధికా రి సరస్వతి, హౌసింగ్ పీడీ శ్రీనివాస్ పాల్గొన్నారు.


