
తప్పంతా వాళ్లదే
● రెవెన్యూశాఖ సమాచార లోపంతోనే పొరపాట్లు ● స్థలాల డీమార్కేషన్ చేయకపోవడంతోనే తప్పులు ● ప్రతీ డాక్యుమెంట్ పరిశీలించాలంటే ఇబ్బంది ● సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్నాం ● పత్రాలు ఉంటే ఇంటినంబర్లకు రిజిస్ట్రేషన్లు ● డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ప్రవీణ్కుమార్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా రూ.వందల కోట్లు అవినీతి.. ప్రభుత్వ భూములను ఏదో ఒక కారణం చూపడం, రిజిస్ట్రేషన్లు చేసేయడం, విషయం బయటికి పొక్కితే అవునా..? అంటూ నాలిక కరుచుకోవడం.. నెపమంతా రెవెన్యూ విభా గంపైకి నెట్టేయడం.. ఇదీ రిజిస్ట్రేషన్శాఖలో భూ ములు రిజిస్ట్రేషన్ చేసే అధికారుల తీరు. ఇటీవల కరీంనగర్ పరిధిలో రూ.వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్శాఖ అధికారులు అప్పనంగా రిజిస్ట్రేషన్ చేయడంపై లోకాయుక్త మొట్టికాయలు వేయడంతో రిజిస్ట్రేషన్శాఖ లీలలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. సంబంధితశాఖ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ప్రవీణ్కుమార్ మాత్రం జరుగుతున్న అవినీతి కార్యక్రమాల్లో సబ్రిజిస్ట్రార్ల పాత్ర అసలు లేదని, ఇదంతా రెవెన్యూ విభాగం చూసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ఏ భూమి ప్రభుత్వానిదో, ఏ భూమి నిషేధితమో వారు సమాచారం ఇవ్వడం లేదని, అందువల్లే.. సబ్రిజిస్ట్రార్లు తప్పుడు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని, సమాచారం ఉంటే వారు అలా ఎందుకు చేస్తారని శుక్రవారం శ్రీసాక్షిశ్రీతో ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో హుజురాబాద్, ఇటీవల గంగాధర సబ్రిజిస్ట్రార్లపై ఈ కారణంగానే వేటు పడిందని చెప్పుకొచ్చారు.
ఇప్పటికీ రికార్డుల్లో..
కొత్తపల్లిలోనే సర్వే నంబరు 272/14లో ఉన్న 20 గుంటల భూమిని తొమ్మిదిమందికి ఇటీవల మాజీ సబ్రిజిస్ట్రార్ నూర్ అఫ్జల్ఖాన్ రిజిస్ట్రేషన్ చేసిన విషయం తెలిసిందే. విచారణ జరిపిన ఉన్నతాధికారులు సబ్రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటువేశారు. జూలై 26వ తేదీన సస్పెండ్ చేసినా.. కార్యాలయానికి వచ్చి.. 28వ తేదీన కూడా పనిచేయడం గమనార్హం. ఆయన చేతికి సస్పెన్షన్ ఆర్డర్ వచ్చేలోగా.. 20 గుంటల భూమిలో జరిగిన తొమ్మిది రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. 272 సర్వేనంబర్లో మిగిలిన బైనంబర్లతో ఉన్న భూమి కూడా ప్రభుత్వ భూమి అని ప్రభుత్వ రికార్డుల్లో ఇప్పటికీ చూపిస్తోంది. అయినా, తమకు సమాచారం లేదంటూ రిజిస్ట్రేషన్శాఖ అధికారులు చెబుతున్నారు. పైపెచ్చు.. రెవెన్యూ విభాగం తమకు ప్రొహిబిటెడ్ భూముల సమాచారం ఇవ్వడం లేదంటూ సబ్రిజిస్ట్రార్లు యథేచ్ఛగా ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్లు చేస్తుండటం గమనార్హం.
ఇంటి నంబర్ల బాగోతం
జిల్లా రిజిస్ట్రేషన్శాఖలో వెలుగుచూస్తున్న వరుస అక్రమాలపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. కొత్తపల్లిలోని సర్వే నంబరు 272/14లోని 20 గుంటల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇంటి నంబర్లతోనూ పలు ప్రభుత్వ భూములను కాజేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. కరీంనగర్లో అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల్లో షెడ్లుకట్టి, సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా ఇంటినంబర్లు పొందిన వందలాది ఇళ్ల వివరాలను కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ గుర్తించింది. ఆయా నంబర్లపై ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయవద్దని రిజిస్ట్రేషన్ శాఖకు అధికారికంగా లేఖ రాసింది. దీంతో నగరంలో రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా అడ్డుకట్ట వేయగలిగినట్లయింది.
జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం
రెండు నెలల్లో రూ.వందల కోట్ల అక్రమాలు
కొత్తపల్లి మండలంలోని సర్వే నంబర్లు 175, 197, 198లోని దాదాపు 20 ఎకరాల ప్రభుత్వ స్థలంలో జరిగిన 476 రిజిస్ట్రేషన్లు లోకాయుక్త ఆదేశాలతో రద్దయిన విషయం తెలిసిందే. 175, 197, 198 సర్వేనంబర్లలోని 20 ఎకరాల ప్రభుత్వ భూమి విషయంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల మధ్య సమన్వయలోపం ఉందన్న విషయం 1995లోనే వెలుగుచూసింది. మూడు దశాబ్దాలు గడిచినా ఈ రెండు శాఖలు ఎందుకు పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకోలేదో.. ఎందుకు లోకాయుక్త నుంచి ఆదేశాలు వచ్చే వరకూ రిజిస్ట్రేషన్లు చేశారో జిల్లా ఉన్నతాధికారులకే తెలియాలి. ఫలితంగా ప్రభుత్వ భూమిలో ప్లాట్లు కొన్న 476 మంది అమాయకులు న్యాయం కావాలంటూ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ కొనుగోళ్లతో రూ.వందల కోట్లు చేతులు మారాయి.
పత్రాలుంటే రిజిస్ట్రేషన్లు చేస్తాం
ఇంటినంబర్ల విషయంలో మాకు కొన్ని ఆదేశాలు వచ్చిన మాట వాస్తవమే. సరైన డాక్యుమెంట్లు, పన్నులు కట్టిన పత్రాలు, గ్రామ కార్యదర్శి లేదా బల్దియా కమిషనర్ ఎండార్స్మెంట్ ఉంటే రిజిస్ట్రేషన్ చేస్తాం. ప్రొహిబిటెడ్ భూముల విషయంలో రెవెన్యూశాఖదే బాధ్యత. వివాదాస్పద భూములను ఎప్పటికప్పుడు డీమార్కేషన్ చేసి రికార్డులను అప్డేట్ చేయకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతోంది. చాలా సందర్భాల్లో సబ్రిజిస్ట్రార్లు ప్రొహిబిటెడ్ ప్రాపర్టీలను తెలియకుండా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మాకు ఫీల్డ్ స్టాఫ్ లేరు. ప్రతీ ప్రాపర్టీని విచారణ చేయాలంటే.. మేం రోజుకు ఒక్క డాక్యుమెంట్ కూడా చేయలేం. ఇప్పటికే పని ఒత్తిడితో సతమవుతున్నాం. – ప్రవీణ్కుమార్,
డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, కరీంనగర్

తప్పంతా వాళ్లదే