
ఎమ్మెల్యేకు హెచ్ఆర్డీఏ నోటీసులు
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఆర్ఎంపీ, పీఎంపీలకు మద్దతు పలకడమే కాకుండా, టీజీఎంసీ సభ్యుడిని అవమానించారంటూ మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు మెడికల్ కౌన్సిల్ హెల్త్ కేర్ రిఫామ్స్ డాక్టర్ అసోషియేషన్ (హెచ్ఆర్డీఏ) నోటీసులు పంపించింది. మంగళవారం తిమ్మాపూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి తన క్యాంపు కార్యాలయంలో ఆర్ఎంపీ, పీఎంపీలతో సమావేశమయ్యారు. వారి ఇబ్బందుల గురించి చర్చించి గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో సేవలు అందిస్తున్నారని, వారివద్ద స్థెతస్కోప్, బీపీ మిషన్లు ఉంటే తప్పేంటని టీఎస్ఎంసీ సభ్యుడిని ప్రశ్నించారు. బ్లాక్మెయిలింగ్ మానుకోవాలని హెచ్చరించారు. దీనిపై స్పందించిన హెచ్ఆర్డీఏ చట్ట విరుద్ధంగా ఆధునిక వైద్యం చేస్తున్నవారికి మద్దతు పలకడం ఏంటంటూ నోటీసులు ఇచ్చారు. నిర్ణీత గడువులోగా వివరణ ఇవ్వాలని సూచించారు.
అక్రమ నిర్మాణాల కూల్చివేత
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతోంది. బుధవారం కిసాన్నగర్లోని అక్రమ నిర్మాణాన్ని, అంబేడ్కర్నగర్లో రోడ్డు ఆక్రమించి నిర్మించిన ప్రహరీని డిస్ట్రిక్ట్ టాస్క్ఫోర్స్ ఆధ్వర్యంలో కూల్చివేశారు. అర్బన్ తహసీల్దార్ నరేందర్, నగరపాలకసంస్థ ఏసీపీ శ్రీధర్, టీపీఎస్లు సంధ్య, తేజస్విని పాల్గొన్నారు. అదేవిధంగా ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచి డీమార్ట్ వైపు వెళ్లే రోడ్డులో ఆక్రమణలను తొలగించారు. ప్రజా వాణిలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా డిప్యూ టీ కమిషనర్ ఖాదర్ మొహియొద్దీన్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. చింతకుంట, రేకుర్తి, లక్ష్మిపూర్, తీగలగుట్టపల్లి, మల్కాపూర్, సీతారాంపూర్లలో పరిశీలించారు.
డంప్యార్డ్ సమస్య పరిష్కారానికి కృషి
కరీంనగర్ కార్పొరేషన్: డంప్యార్డ్ సమస్య పరిష్కారానికి ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తానని పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు హామీ ఇచ్చారు. బుధవారం డంప్యార్డ్ బాధితులు కలిసి తమ ఇబ్బందులను వివరించారు. రాజేందర్రావు మాట్లాడుతూ డంప్యార్డ్ సమస్యను సమష్టిగా పరిష్కరిద్దామన్నారు. మాజీ కార్పొరేటర్ కట్ల సతీశ్, ఆకుల శ్రీనివాస్, మంగ, దుర్గం సంపత్, శ్రీనివాస్,మధు, గోపి పాల్గొన్నారు.
తపాలా సేవల్లో ఐటీ 2.0
సప్తగిరికాలనీ(కరీంనగర్): ఈ నెల 22 నుంచి కరీంనగర్ డివిజన్లోని అన్ని తపాలా కార్యాలయాల్లో ఐటీ 2.0 సాంకేతికతను అందుబాటులోకి తేనున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ కె.శివాజీ తెలిపారు. కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న రెండు హెడ్ పోస్ట్ఆఫీసులు, 52 సబ్ పోస్ట్ ఆఫీసులు, 389 బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో ఈ కొత్త సాంకేతికతను 22నుంచి అమలు చేయనున్నామని పేర్కొన్నారు. జూలై 18, 19 తేదీల్లో తయారీ పనులు, జూలై 21న పూర్తిస్థాయిలో లావాదేవీలు నిలిపివేయనున్నట్లు తెలిపారు.
రైతు సంఘానికి చేయూత
కొత్తపల్లి: మల్కాపూర్లోని జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రైతు సంక్షేమ సంఘ భవనానికి బుధవారం విశ్రాంత ఉపాధ్యాయులు, రాజరాజేశ్వరీ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నరహరి లక్ష్మారెడ్డి తన తండ్రి నరహరి రాంరెడ్డి జ్ఞాపకార్థం బుధవారం రూ.25వేలను రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుంటపల్లి రవికి అందజేశారు. రైతుల సంక్షేమానికి తనవంతు సాయం అందిస్తానని లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి కొత్త మహేశ్, కోశాధికారి గంగాధర నరేశ్, గౌరవ అధ్యక్షుడు గంగాధర లస్మయ్య, మాజీ ఉపసర్పంచ్ కాంతాల జగన్రెడ్డి, సభ్యులు కొత్త కనకయ్య, కొత్త లింగమూర్తి, కొత్త మధు, పల్లాటి ప్రశాంత్, బొల్లబత్తిని శ్రీనివాస్, పల్లాటి జలంధర్, కుమ్మరిరామస్వామి, పండుగ కృష్ణ కుమార్, జాడి రాజు పాల్గొన్నారు.
శానిటరీ సూపర్వైజర్ల నియామకం
కరీంనగర్ కార్పొరేషన్: చాలా సంవత్సరాలుగా నగర పాలక సంస్థలో ఖాళీగా ఉన్న శానిటరీ సూపర్ వైజర్ పోస్టులు ఎట్టకేలకు భర్తీ అయ్యాయి. శానిటరీ సూపర్ వైజర్లుగా శ్యామ్ రాజ్, అనిల్ కుమార్ లు నియమిస్తూ బుధవారం ఆదేశాలు జారీ అయ్యాయి.

ఎమ్మెల్యేకు హెచ్ఆర్డీఏ నోటీసులు