
కొడుకు చితికి నిప్పు పెట్టిన తల్లి
ధర్మపురి: కుటుంబ పెద్ద అనారోగ్యంతో మూడేళ్ల క్రితం మృతి చెందాడు. కుటుంబ భారమంతా తల్లిపై పడింది. ఆమె కష్టాలు చూడలేక ఒక్కగానొక్క కుమారుడు ఇంటికి పెద్ద దిక్కుగా మారాడు. స్థానికంగా ఉపాధి లేకపోవడంతో కుటుంబాన్ని పోషించుకునేందుకు రెండు నెలల క్రితం దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఆ యువకుడిని విధి వక్రీకరించింది. ఇటీవల ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడే మృతిచెందాడు. అతడి మృతదేహం స్వగ్రామం రాగా.. తల్లి హృదయం తల్లడిల్లింది. తనకు తలకొరివి పెట్టాల్సిన కుమారుడికి ఆమె నిప్పు పెట్టింది. ఈ విషాధ ఘటన ధర్మపురిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యశోద, పెద్దన్న దంపతులకు కుమారుడు సిద్దార్థ (19), కూతురు సంతానం. సిద్దార్థ చిన్నతనంలోనే పెద్దన్న మరణించాడు. కుటుంబాన్ని పోషించేందుకు రెండు నెలల క్రితం ఎడారి దేశం వెళ్లాడు. ఏసీ కంపెనీలో టెక్నీషియన్గా పని నేర్చుకుంటున్నాడు. వారం క్రితం ఓ బిల్డింగ్లో పనులు చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. తోటి స్నేహితులు అతడిని అక్కడి ఆస్పత్రిలో చేర్పించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సిద్దార్థ మృతదేహం బుధవారం స్వగ్రామం చేరుకుంది.
తలకొరివి పెట్టిన తల్లి
కొడుకు చితికి తల్లి యశోధ తలకొరివి పెట్టడం అందరినీ కలిచివేసింది. మూడేళ్ల క్రితం భర్త..ఇప్పుడు ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో ఆమె రోదనలకు అంతులేకుండాపోయింది. ఎవరికోసం బతకాలె బిడ్డా అంటూ రోదించడం అక్కడున్నవారిని కదిలించింది.
పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్లిన యువకుడు
వెళ్లిన రెండు నెలలకే గుండెపోటుతో మృతి
శవాన్ని చూసి తల్లడిల్లిన తల్లి హృదయం

కొడుకు చితికి నిప్పు పెట్టిన తల్లి