జూలై 31నుంచి అభ్యంతరాల స్వీకరణ..
నేటినుంచి నెలరోజులు..
‘‘ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) అంటే ఓటర్ల జాబితాను శుద్ధి చేయడం.. అనర్హుల ఓట్లు తొలగించి, అర్హులకే ఓటు హక్కు ఉండేలా చూడడం.. ఇందులో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్లి, ఓటర్లకు ఎన్యుమరేషన్ పత్రాలు అందిస్తారు. వాటిని పూరించి తిరిగి బీఎల్వోలకు ఇవ్వాల్సి ఉంటుంది’’ అని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియపై ఆందోళన అవసరం లేదన్నారు. అర్హులందరి ఓట్లు ఉండేలా చూస్తామని పేర్కొన్నారు. గురువారంనుంచి ‘సర్’ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ‘సాక్షి’ ఆయనను
ఇంటర్వ్యూ చేసింది. ఆ వివరాలు.. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
ఓటరుగా అన్ని అర్హతులు ఉన్న పౌరుల పేర్లు జాబితాలో ఉండాల్సిందే. ఇదే సమయంలో అనర్హుల పేర్లు జాబితాలో చేర్చబడకూడదన్న ముఖ్య లక్ష్యంతో ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) చేపట్టింది. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశాం.
ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ కార్యక్రమంలో బీఎల్వోలే కీలకం. ఒక్కో పోలింగ్ బూత్నకు ఒక్కో బీఎల్వో చొప్పున జిల్లాలో 796 బీఎల్వోలున్నారు. వీరికి ఈనెల 15 నుంచి 24 వరకు శిక్షణ ఇచ్చాం. అవసరమైన సామగ్రిని అందించాం. 97 మంది సూపర్వైజర్లను నియమించాం. వీరితోపాటు ఆయా మండలాల తహసీల్దార్లు సర్ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజక వర్గాలకు ఆర్డీవో, జుక్కల్కు రెవెన్యూ అదనపు కలెక్టర్ ఇన్చార్జీగా వ్యవహరిస్తారు.
జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల పరిధిలో 796 పోలింగ్ బూత్లున్నాయి. సర్కు సంబంధించి ఆయా బూత్ల పరిధిలో మ్యాపింగ్ ప్రక్రియ 84.32 శాతం పూర్తయ్యింది. జుక్కల్లో 86.86 శాతం, ఎల్లారెడ్డిలో 84.45 శాతం, కామారెడ్డిలో 81.29 శాతం జరిగింది. బాన్సువాడకు సంబంధించి నిజామాబాద్ నుంచి పర్యవేక్షణ జరుగుతుంది. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ప్రస్తుతం 6,96,006 మంది ఓటర్లు ఉన్నారు. సమగ్ర సవరణ తర్వాత అర్హులైన ఓటర్లు ఎంత మంది ఉన్నారన్న లెక్క తేలుతుంది.
బూత్లెవల్ అధికారి ఇంటికి వచ్చినపుడు 2026 అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండే వారి వివరాలు చెబితే ఫారం–6 ఇస్తారు. డిక్లరేషన్ ఫారంతో పాటు ఫారం–6 తీసుకుని వాటిని పూరించి ఇవ్వాలి. సమగ్ర సవరణకు సంబంధించి ఎన్యూమరేషన్ ఫారం అందకపోతే బీఎల్వోను సంప్రదించవచ్చు.
ముసాయిదా జాబితాలో ఏవైనా పొరపాట్లు ఉంటే సరిచేయడానికి నెలరోజులపాటు అవకాశం ఉంటుంది. ఇది జూలై 31నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు కొనసాగుతుంది. ఓటర్ జాబితాలో ఏవైనా తప్పులు ఉంటే సరిచేయడం, ఇతర అభ్యంతరాలు నమోదు చేసుకోవడం, కొత్త ఓటర్ల నమోదు వంటి వాటికి అవకాశం ఉంటుంది. జూలై 31నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు ఎన్నికల అధికారులు ప్రతి అభ్యంతరాన్ని పరిశీలిస్తారు. అవసరమైతే ఆయా వివరాలపై విచారణ కూడా చేస్తారు. తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 1న ప్రచురించడం జరుగుతుందని వివరించారు.
నేటి నుంచి ఇంటింటికి బీఎల్వోలు
నెల రోజులు కొనసాగనున్న ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ
అర్హుల ఓట్లు జాబితాలో ఉండాల్సిందే..
సర్వే తర్వాతే తేలనున్న లెక్క
‘సాక్షి’తో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
సర్ ప్రక్రియలో కీలక దశ గురువారం ప్రారంభ కానుంది. ఇందులో భాగంగా బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ పత్రాలను అందిస్తారు. వాటిని ఎలా పూరించాలన్న విషయమై అవగాహన కల్పిస్తారు. ఓటర్లు వాటిని నింపి తిరిగి అందించాల్సి ఉంటుంది. లేకపోతే వారి వివరాలు ముసాయిదా జాబితాలో ఉండవు. ఈ ప్రక్రియ వచ్చేనెల 24 వరకు కొనసాగుతుంది. ఈ నెల రోజుల్లో బీఎల్వోలు ఒక్కో ఇంటిని కనీసం మూడుసార్లు సందర్శిస్తారు. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తాం.
ఓటరు ఉపాధి కోసమో, ఉద్యోగం కోసమో ఇతర ప్రాంతాలకు వలస వెళ్తే.. వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సంబంధిత కుటుంబ సభ్యులు ఎన్యుమరేషన్ ఫాం తీసుకుని పూరించి, సంతకం చేసి బీఎల్వోకు అందిస్తే సరిపోతుంది. ఇంటిగణన సమయంలో కుటుంబం మొత్తం అందుబాటులో లేనిపక్షంలో ఆన్లైన్ ఎన్యూమరేషన్ ఫాం సమర్పించే ఆప్షన్ను ఉపయోగించుకోవచ్చు.


