గాంధారి(ఎల్లారెడ్డి): తండ్రి మందలించాడని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాలు.. పత్తి రాము(22) అనే యువకుడు వింతగా ప్రవర్తిస్తూ అమ్మాయిల మాదిరిగా డ్రెస్సులు వేసుకునే వాడు. ఏ పని చేయకుండా తిరుగుతుండడంతో ఏదైనా పని చేసుకోవాలని తండ్రి కాశీరాం మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన రాము మంగళవారం రాత్రి తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
జిల్లా కేంద్రంలో కేరళ టీచర్ ..
కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రం శివారులో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో పని చేయడానికి పది రోజుల క్రితం కేరళ నుంచి వచ్చిన టీచర్ తాను నివాసం ఉంటున్న క్వార్టర్స్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. నరసన్నపల్లి సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్ గా పనిచేయడానికి కేరళకు చెందిన దేవిక విల్లా(30) పది రోజుల క్రితం వచ్చింది. బుధవారం సాయంత్రం తన గదిలో దేవిక ఉరేసుకొన్నట్లు గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దేవునిపల్లి పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.


