సాగర్ ఆయకట్టు కింద నాట్లు..
సన్నరకాలే సాగు చేస్తున్నా..
బోనస్ అందించే వరి వంగడాల వివరాలు..
ఎంపిక చేసిన వంగడాలకే ప్రోత్సాహకం ఇస్తామంటున్న సర్కారు
● ఆలస్యంగా వెలువడిన ప్రకటన
● ఇప్పటికే నారుమళ్లు సిద్ధం చేసిన రైతులు
● పలుచోట్ల మొదలైన నాట్లు
● ఆందోళనలో అన్నదాతలు
జిల్లాలో ప్రధాన పంట వరి. ఈ ఖరీఫ్లో 3.20 లక్షల ఎకరాలలో వరి పంట సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఎల్ నినో ప్రభావంతో ఈసారి వర్షాభావ పరిస్థితులు ఉండొచ్చని తెలిసినా.. రైతులు మాత్రం వరి సాగుకే మొగ్గు చూపారు. ప్రధానంగా నిజాంసాగర్, పోచారం, కౌలాస్ ప్రాజెక్టుతో పాటు సింగితం రిజర్వాయర్, చెరువులు, కుంటలతోపాటు వ్యవసాయ బోరుబావులపై ఆధారపడి పంటలు సాగు చేసే రైతులు విత్తనాలు కొనుగోలు చేసి నారు మడులు కూడా సిద్ధం చేసుకున్నారు.
వచ్చేవారంలో ప్రచారం..
ప్రభుత్వం బోనస్ కోసం ప్రతిపాదించిన ఏడు రకాల వరి వంగడాలపై 23వ తేదీనుంచి వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జిల్లాలోని 104 రైతు వేదికలలో సీడ్ మేళాలు నిర్వహిస్తామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
మాగి శివారులో సిద్ధం చేసిన నారుమడి
నీటివనరులు ఉన్న రైతులు ముందస్తుగానే నాట్లు కూడా మొదలుపెట్టారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ పరిధిలోని బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్, వర్ని, రుద్రూర్, కోటగిరి, ఎడపల్లి, బోధన్ ప్రాంతాల్లో వారం రోజుల నుంచి నాట్లు వేస్తున్నారు.
ప్రభుత్వం క్వింటాలుకు రూ. 500 చొప్పున బోనస్ ఇస్తుందన్న ఆశతో అత్యధిక శాతం రైతులు సన్నరకాలే సాగు చేస్తున్నారు. సన్న వరికి బోనస్ ఇస్తామన్న కొత్తలో వ్యవసాయ శాఖ సర్వేలు నిర్వహించి 33 రకాల సన్న వరి వంగడాలను వేసుకోవచ్చని సూచించింది. రైతులు తమ నేలలకు అనుకూలంగా ఉండి అధిక దిగుబడి వచ్చే సన్న రకాలను ఎంచుకుని నారు పోశారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా శిశిర–108, రేష్మ–1150, రేష్మ–1116, సిరి మసూరి, సిరి లీడర్ లాంటి అధిక దిగుబడి ఇచ్చే సన్న రకాలను వేసుకున్నారు. ఈ రకాలు మంచి దిగుబడి ఇవ్వడంతో పాటు తెగుళ్ల బారిన పడవని రైతులు అంటున్నారు. బోనస్ విషయంలో ప్రభుత్వం చేసిన ప్రకటన రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రతిపాదించిన ఏడు రకాల వరి వంగడాలను సాగు చేసిన రైతులకే బోనస్ వర్తిస్తుందని చెప్పడంతో ఏం చేయాలో తేల్చుకోలేకపోతున్నారు. అయితే ఈ నిర్ణయమేదో నారుపోసుకోక ముందే తీసుకుంటే బాగుండేదని, ఆలస్యంగా ప్రకటించడంతో నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. సన్నరకాలన్నింటికి బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
వరి వంగడం రకం పంటకాలం(రోజులలో)
బీపీటీ –5204 140–150
తెలంగాణ సోనా
(ఆర్ఎన్ఆర్ –15048) 120–125
కేఎన్ఎం – 1638 120–125
జైశ్రీరాం 130–135
హెచ్ఎంటీ 135–145
డబ్ల్యూజీఎల్–962 125–130
డబ్ల్యూజీఎల్–44(సిద్ది) 140–145
ఓవైపు వరుణుడి కరుణ లేక కాలం అవుతుందో లేదోనని ఆందోళన చెందుతున్న రైతులను.. బోనస్పై సర్కారు చేసిన ప్రకటన ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే చాలామంది రైతులు విత్తనాలు కొనుగోలు చేసి నారుమళ్లు సిద్ధం చేసుకున్నారు. కొన్ని ప్రాంతాలలో నాట్లు కూడా మొదలయ్యాయి. ఈ పరిస్థితులలో ఏడు రకాల వరి వంగడాలకే బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
– నిజాంసాగర్/ఎల్లారెడ్డి


