క్రమశిక్షణా కమిటీ ముందు గడ్డం చంద్రశేఖర్‌ రెడ్డి హాజరు | - | Sakshi
Sakshi News home page

క్రమశిక్షణా కమిటీ ముందు గడ్డం చంద్రశేఖర్‌ రెడ్డి హాజరు

Jun 19 2026 1:06 AM | Updated on Jun 19 2026 1:06 AM

క్రమశిక్షణా కమిటీ ముందు గడ్డం చంద్రశేఖర్‌ రెడ్డి హాజరు సామాజిక సమరసత వేదిక నియామకాలు సమస్యలను పరిష్కరించాలి

కామారెడ్డి టౌన్‌: టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌ రెడ్డి, ఆయన సతీమణి మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ ఇందుప్రియలు గురువారం టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ముందు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కమిటీ ముందు హాజరై కమిటీ చైర్మన్‌ మల్లు రవికి తన వివరణ ఇచ్చారు. పక్షం రోజుల క్రితం కమిటీ జారీ చేసిన షోకాజ్‌ నోటీస్‌కు సమాధానమిస్తూ నివేదికలను చైర్మన్‌కు స్వయంగా అందజేశారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, చంద్రశేఖర్‌రెడ్డి మధ్య కొంత కాలంగా కోల్డ్‌ వార్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులు చేసుకున్నారు.

కామారెడ్డి అర్బన్‌: సామాజిక సమరసత వేదిక ఇందూర్‌ విభాగ్‌ సంయోజక్‌గా సంగన్నగారి బాల్‌రాజ్‌ గౌడ్‌ నియమితులయ్యారు. వేదిక రాష్ట్ర కన్వీనర్‌ అప్పల ప్రసాద్‌ నూతన నియామకాలను ప్రకటించినట్టు జిల్లా అధ్యక్షుడు అమృత రాజేందర్‌ తెలిపారు. ఇందూర్‌ విభాగ్‌ సంయోజక్‌గా ఉన్న సూర్యనారాయణను సమరసత ప్రాంత సభ్యుడిగా నియమితులయ్యా రు. కామారెడ్డి నగర సంయోజక్‌గా ఉత్తునూరి దత్తురావుకు బాధ్యతలు అప్పగించారు.

సైబర్‌ నేరాలపై అవగాహన

లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో సైబర్‌ నేరాలపై ఖాతాదారులు, బ్యాంకు సిబ్బందికి పోలీసులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడారు. సైబర్‌ నేరాలతో మోసపోతే టోల్‌ ఫ్రీ నంబర్‌ 1903కి కాల్‌ చేయాలని సూచించారు. ఎవరికి ఓటీపీలు చెప్పవద్దన్నారు. బ్యాంకు అధికారులు, పోలీసులు ఓటీపీలు చెప్పమని ఎవరు అడగరని అన్నారు. అత్యవసర సమయాల్లో 100/112 నంబర్లకు డయల్‌ చేయాలన్నారు. కళాబృందం సభ్యులు తిరుపతి, శేషారావు, ప్రభాకర్‌, సాయిలు, షీటీమ్‌ సభ్యులు శ్రీశైలం, సుప్రజ, బ్యాంకు మేనేజర్‌ జ్యోతి, సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు.

మున్సిపల్‌ కార్మికుల డిమాండ్‌

రెండు రోజుల రిలే దీక్షలు ప్రారంభం

కామారెడ్డి టౌన్‌ : మున్సిపాలిటీలో పనిచేస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కార్మికులు డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌తో సీఐటీయూ అనుబంధ మున్సిపల్‌ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రెండు రోజుల రిలే నిరాహార దీక్షలను గురువారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు రాజనర్సు, నర్సింగ్‌ మాట్లాడుతూ తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని కోరారు. నిరసన దీక్షలో నాయకులు మహబూబ్‌, లక్ష్మణ్‌, దీవెన, అయాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement