నిజాంసాగర్(జుక్కల్): గుడిసెలు, రేకులషెడ్లు, పాకల్లో నివసిస్తున్న కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టించడం ప్రభుత్వ లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. గురువారం జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల సమస్యలపై జిల్లాస్థాయి అధికారుల సమీక్ష నిర్వహించారు. అనంతరం ఇందిరమ్మ లబ్ధిదారులు, సర్పంచులు, మండల కాంగ్రెస్ నాయకులు, అధ్యక్షులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రెండో విడత ఇందిరమ్మ పథకం కింద గుడిసెలు ఉన్న వారికి ఇళ్లు ఇస్తున్నామన్నారు. గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాలను పకడ్బందీగా గుర్తించాలన్నారు. సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు గుడిసెలున్న కుటుంబాల సర్వే చేపట్టాలని సూచించారు. మొదటి విడత ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు మంజూరై వివిధ కారణాలతో బిల్లులు రాని వారందరికి బిల్లులు ఇచ్చేలా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అదనపు కలెక్టర్ ఎన్వై.గిరి, హౌసింగ్ పీడీ విజయ్పాల్రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు రవీందర్రెడ్డి, ప్రజాపండరి, శ్యాం, తదితరులు పాల్గొన్నారు.


