ఇందూరులో గ్రీన్‌ లంగ్‌ | - | Sakshi
Sakshi News home page

ఇందూరులో గ్రీన్‌ లంగ్‌

Jun 18 2026 1:17 AM | Updated on Jun 18 2026 1:17 AM

ఆర్మూర్‌: ప్రజలకు కనువిందు చేసే ప్రకృతి అందాలు, ఒత్తిడిని తగ్గించే వాతావరణం, స్వచ్ఛమై న గాలినిచ్చే చెట్లు.. మొత్తానికి అటవీ అందాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది అరణ్య అర్బన్‌పార్క్‌. నిజామాబాద్‌ నగరవాసులతోపాటు ఆయా ప్రాంతాల ప్రజలకు ‘గ్రీన్‌ లంగ్‌ స్పేస్‌’ (హరిత ఊపిరి తిత్తులు)గా ఉపయోగపడనుంది. అటవీ శాఖ ఆధ్వర్యంలో మాక్లూర్‌ మండలం మానిక్‌ బండార్‌, అడవి మామిడిపల్లి, చిన్నాపూర్‌ శివార్లలోని రిజర్వ్‌ ఫారెస్ట్‌కు చెందిన 476.30 ఎకరాల విస్తీర్ణంలో రూ.5 కోట్ల నిధులతో అర్బన్‌ పార్క్‌ను ఏర్పాటు చేశారు. పార్క్‌ను ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి గురువారం వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో అఫారెస్టేషన్‌, కాంపా(సీఏఎంపీఏ), నుడా (ఎన్‌యూడీఏ), ఎన్‌ఎంసీ తదితర ప్రభుత్వ పథకాలతో 63వ నంబర్‌ జాతీయ రహదారిని ఆనుకొని ఈ పార్క్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రజలకు పచ్చదనాన్ని చేరువ చేయడం, పట్టణ పర్యావరణ నాణ్యతను మెరుగుపరచడంలో ప్రభుత్వ సంకల్పానికి ఈ పార్క్‌ ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. పర్యావరణ పరిరక్షణతో పట్టణాభివృద్ధిని సమన్వయం చేయడానికి ఇదొక నమూనా అని అటవీ శాఖ అధికారులు అంటున్నారు.

హాజరు కానున్న ప్రముఖులు

అర్బన్‌ పార్కు ప్రారంభోత్సవానికి రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు పి సుదర్శన్‌రెడ్డి, మహ్మద్‌ షబ్బీర్‌ అలీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ ధర్మపురి అరవింద్‌ ముఖ్య అతిథులుగా హాజరకానున్నారు. ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేష్‌ రెడ్డి సభకు అధ్యక్షత వహిస్తారు. ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ సీ సువర్ణ, జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, జిల్లా అటవీ శాఖాధికారి సిద్ధార్థ్‌ విక్రమ్‌ సింగ్‌ తదితరులు పాల్గొననున్నారు.

పార్క్‌లో ఏర్పాటు చేసిన నాలుగు అంతస్తుల వాచ్‌ టవర్‌

అర్బన్‌ పార్క్‌ ప్రధాన ద్వారం

సదుపాయాలు

గ్రావెల్‌ వాకింగ్‌ ట్రాక్‌లు, ఓపెన్‌ జిమ్‌, పిల్లల సాహస క్రీడలకు ప్రత్యేక స్థలం, వాచ్‌ టవర్‌, శౌచాలయాల సముదాయం, నాలుగు రచ్చబండలు, సందర్శకులకు విశ్రాంతి కోసం ప్రత్యేక స్థలాలు.

మాక్లూర్‌ మండలం చిన్నాపూర్‌

శివారులో అర్బన్‌ పార్క్‌ ఏర్పాటు

476 ఎకరాల విస్తీర్ణంలో రూ.5 కోట్ల వ్యయంతో..

నేడు వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement