కామారెడ్డి టౌన్: కొందరు వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా అసభ్యకరంగా, పరువు నష్టం కలిగించేలా దుష్ప్రచారం చేస్తున్నారని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఇందుప్రియ మాట్లాడుతూ.. జూన్ 12న కామారెడ్డి డిస్ట్రిక్ట్ ఫేస్బుక్ పేజీలో ముక్తార్ అనే వ్యక్తి తనను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర, అవమానకరమైన పోస్టును అప్లోడ్ చేశాడని వివరించారు. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఈ దుష్ప్రచారానికి తెరలేపారని పేర్కొన్నారు. షేరు, అంజాద్, పర్వేజ్ హైమద్, రాజేశ్వర్, గుడుగుల శ్రీనివాస్, ఇర్ఫాన్, కై ఫ్, సుచితాన్ రెడ్డి, కొప్పుల మహేష్ రెడ్డి తదితరులు గ్రూపులుగా ఏర్పడి సోషల్ మీడియా వేదికగా మహిళలపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఉదంతంపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కమిషన్ చైర్పర్సన్ హామీ ఇచ్చినట్లు ఇందుప్రియ తెలిపారు.


