
రుణమాఫీ అంతేనా!?
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో పంట రుణాల మాఫీ కీలకమైనది. ఆ పార్టీనే అధికారంలోకి రావడంతో రుణ విముక్తులమవుతామని రైతులు ఆశించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత విధివిధానాల పేరుతో చాలా సమయం తీసుకుంది. కుటుంబం యూనిట్గా రూ. 2 లక్షల పంట రుణాలను మాఫీ చేస్తామంటూ కొర్రీలు పెట్టి అర్హుల జాబితాను కుదించింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులను అర్హుల జాబితా నుంచి తొలగించింది. చివరికి గతేడాది ఆగస్టులో మాఫీ ప్రక్రియ ప్రారంభించింది. ఆధార్, బ్యాంకు ఖాతా, పాస్బుక్లలో తప్పులు లాంటివి సరి చేసి నాలుగు విడతల్లో రూ. 2 లక్షలలోపు పంట రుణాలను మాఫీ చేసింది. వడ్డీతో కలిపి రూ. 2 లక్షల రుణం దాటినవారికి ఇప్పటికీ రుణమాఫీ వర్తించలేదు. అలాగే సాంకేతిక సమస్యలతో పలువురికి సంబంధించిన రూ.2 లక్షలలోపు రుణాలు కూడా మాఫీ కాలేదు.
సగం మంది ఎదురుచూపులు..
రుణమాఫీ కటాఫ్ తేదీ నాటికి జిల్లాలో 1,98,374 మంది రైతులు వివిధ బ్యాంకుల్లో రుణాలు పొంది ఉన్నారు. ఇందులో మొదటి విడతలో 49,540 మందికి, రెండో విడతలో 24,816 మందికి, మూడో విడతలో 16,903 మందికి, నాలుగో విడతలో 8,942 మందికి రుణమాఫీ అయ్యింది. నాలుగు విడతల్లో కలిపి 1,00,201 మంది రైతులకుగాను రూ.717 కోట్లు రైతులకు అందాయి. మరో 98 వేల మంది రైతులకు నిరాశే మిగిలింది.
సర్కారు స్పందించేనా
కుటుంబం యూనిట్గా రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రూ. 2 లక్షలకుపైన ఉన్న మొత్తాన్ని రైతులు చెల్లిస్తే రుణమాఫీ చేస్తామని పేర్కొంది. దీంతో చాలామంది రైతులు రూ. 2 లక్షలకుపైన ఉన్న అప్పును తీర్చేశారు. అయినా సర్కారు వీరి విషయాన్ని పట్టించుకోవడం లేదు. ప్రతిపక్షాలు సైతం ఈ సమస్యను పట్టించుకోకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. తమ పంట రుణాలను మాఫీ చేసి రుణ విముక్తులను చేయాలని కోరుతున్నారు.
అధికారంలోకి వస్తే రూ. 2 లక్షలలోపు పంట రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ.. పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. కుటుంబం యూనిట్గా తీసుకోవడం, ఇతర కారణాలతో జిల్లాలో సగం మందికి ప్రయోజనం దక్కలేదు. ఈ విషయమై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేదు. ప్రతిపక్షాలు సైతం ఈ సమస్యను పట్టించుకోవడం లేదు. దీంతో లబ్ధి చేకూరని రైతులు నిరాశ చెందుతున్నారు. – కామారెడ్డి క్రైం
జిల్లాలో 98 వేల మందికి అందని లబ్ధి
పట్టించుకోని సర్కారు..
పాలకులను నిలదీయని ప్రతిపక్షాలు
నిరాశలో రుణమాఫీ కాని రైతులు