
గది ఒకటి.. తరగతులు రెండు
రామారెడ్డి : శిథిలావస్థకు చేరిన భవనాలను తొలగించిన అధికారులు.. అవసరమైన తరగతి గదుల నిర్మాణంపై దృష్టి సారించలేదు. దీంతో ఒకే గదిలో రెండు రెండు తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాలకుల నిర్లక్ష్యంతో రామారెడ్డి ఉన్నత పాఠశాల విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు.
రామారెడ్డి జిల్లా పరిషత్ బాలుర పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో కొన్ని గదులను తొలగించారు. ప్రస్తుతం 5 గదులు మాత్రమే ఉన్నాయి. ఇందులో ఒక గదిని స్టాఫ్ రూంగా వినియోగిస్తుండగా.. మరో గదిని కంప్యూటర్ ల్యాబ్తోపాటు క్రీడా సామగ్రి నిల్వ చేయడానికి ఉపయోగిస్తున్నారు. దీంతో మిగిలిన మూడు గదుల్లో ఐదు తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం 6, 7 తరగతులు ఒక గదిలో, 9. 10 తరగతులు మరో గదిలో నిర్వహిస్తున్నారు. గతేడాది పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నారు. తొమ్మిదో తరగతిలో 13 మంది, పదో తరగతిలో 20 మంది విద్యార్థులు ఉండడంతో ఒకే తరగతిలో అల్మారాలు అడ్డుపెట్టి పాఠాలు బోధించారు. అయితే ఈసారి తొమ్మిదో తరగతిలో అడ్మిషన్లు పెరిగాయి. పదో తరగతిలో 12 మంది విద్యార్థులే ఉన్నా.. తొమ్మిదో తరగతిలో 40 మంది విద్యార్థులున్నారు. దీంతో ఒకే గదిలో రెండు తరగతులకు పాఠాలు బోధించడం ఇబ్బందికరంగా మారింది. రెండు తరగతి గదులు నిర్మిస్తే సమస్య పరిష్కారమవుతుంది. ప్రాథమిక పాఠశాలలోనూ తరగతి గదుల కొరత ఉంది. పాలకులు స్పందించి వెంటనే తరగతి గదులు మంజూరు చేయించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
అదనపు గదులు నిర్మించాలి
పాఠశాలలో తరగతి గదుల కొరత ఉంది. ఐదు తరగతులకు మూడే గదులున్నాయి. దీంతో 6, 7 తరగతులు ఒక గదిలో, 9, 10 తరగతులు మరో గదిలో నిర్వహిస్తున్నాం. అదనపు తరగతి గదులు నిర్మిస్తే సమస్య ఉండదు.
– ఆనంద్, హెచ్ఎం, రామారెడ్డి హైస్కూల్
ఒకదాంట్లో 6, 7, మరొకదాంట్లో
9, 10 తరగతుల నిర్వహణ
రామారెడ్డి హైస్కూల్లో
ఇబ్బందిపడుతున్న విద్యార్థులు
అదనపు గదులు నిర్మించాలని
కోరుతున్న తల్లిదండ్రులు

గది ఒకటి.. తరగతులు రెండు

గది ఒకటి.. తరగతులు రెండు