
డిగ్రీ దోస్త్లో ఆర్ట్స్ కళాశాలను ఎంపిక చేసుకోండి
కామారెడ్డి అర్బన్: డిగ్రీలో ప్రవేశాలకు దోస్త్ మూడవ దశలో ఎంపికవ్వడానికి 19న చివరి అవకాశం ఉన్నందున విద్యార్థులు కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (స్వయంప్రతిపత్తి)ను తొలి ప్రాధాన్యతగా ఎంపిక చేసుకుని నాణ్యమైన విద్య పొందాలని ప్రిన్సిపల్ కె.విజయ్కుమార్ సూచించారు. బుధవారం ఆయన ప్రకటన చేశారు. కళాశాలలో మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధి, ఉద్యోగావకాశాలు పొందే బీబీఏ, బీఎస్సీ హెల్త్కేర్ మెనేజ్మెంట్, బీఎస్సీ కంప్యూటర్స్ హానర్స్ లాంటి కోర్సులున్నాయని ప్రిన్సిపల్ పేర్కొన్నారు.
మొక్కలు సిద్ధం చేయాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): వనమహోత్సవం కార్యక్రమానికి స్థలాలు ఎంపిక చేసుకొని మొక్కలు నాటడానికి నర్సరీల్లోని మొక్కలు సిద్ధం చేసుకోవాలని ఎంపీడీవో నరేష్ సూచించారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో సమావేశమై మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయించాలని సూచించారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరై నిర్మాణాలు చేపట్టని వారి నుంచి, ఇల్లు నిర్మించుకోవాలని ఆసక్తి లేని వారి నుంచి లెటర్లు తీసుకోవాలన్నారు. వర్షాలు కురుస్తున్నందున గ్రామాల్లో పారిశుధ్య పనులు నిరంతరం కొనసాగించాలని సూచించారు. ఎంపీవో మలహరి, ఏపీవో నరేందర్, తదితరులు పాల్గొన్నారు.
మొక్కలు నాటిన బీజేపీ నాయకులు
బాన్సువాడ: బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన సంకల్ప సభలో భాగంగా బుధవారం బాన్సువాడలో బీజేపీ నాయకులు మొక్కలు నాటారు. పట్టణంలోని రామాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నీలం చినరాజులు మొక్కలు నాటి మాట్లాడారు. గత 11 ఏళ్ల కాలంలో మోదీ నాయకత్వంలో అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందుతోందని అన్నారు. కేంద్ర పథకాలు ప్రతీ పౌరుడికి చేరడమే ధ్యేయంగా పని చేయాలని సూచించారు. బీజేపీ నాయకులు కోనాల గంగారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్, శంకర్గౌడ్, లక్ష్మీనారాయణ, చిదరి సాయిలు, కొండని గంగారం, చీకట్ల రాజు, అనీల్, భాస్కర్రెడ్డి, వెంకట్ తదితరులున్నారు.
రైతుల ఖాతాల్లో
రూ.17.36 కోట్ల జమ
బాన్సువాడ: బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాలకు చెందిన 27,536 మంది రైతులకు బుధవారం వరకు రూ.17.36 కోట్ల మేరకు రైతు భరోసా నిధులు జమ అయ్యాయని బాన్సువాడ ఏడీఏ అరుణ తెలిపారు. రైతులు అప్పుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా ఉండేందుకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించిందని ఆమె సూచించారు.
సదాశివనగర్ పరిధిలో రూ.9.66 కోట్లు
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 13,158 మంది రైతులకు రైతుభరోసా కింద డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ఏవో ప్రజాపతి తెలిపారు. రూ.9కోట్ల 66లక్షల 31వేల 618లను జమ చేసినట్లు తెలిపారు.
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): టీడీపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మండల పార్టీ అధ్యక్షుడు ముదాం భీంరావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయకులు దేమె కమ్మరి రాజు, మాజీ జడ్పీటీసీ జయరాజ్, అవుసుల లక్ష్మణ్, వెంకటరెడ్డి ఉన్నారు.

డిగ్రీ దోస్త్లో ఆర్ట్స్ కళాశాలను ఎంపిక చేసుకోండి