
భూసమస్యలకేదీ పరిష్కారం!
లింగంపేట : ధరణిలో లోపాలతో వేలాది మంది రై తులు ఇబ్బందిపడ్డారు. రికార్డులలో తప్పుగా నమోదవడంతో సంక్షేమ పథకాలకు దూరమయ్యారు. వాటిని సరి చేసేందుకు మాడ్యూల్స్ లేకపోవడంతో ఏళ్ల తరబడిగా తహసీల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రస్తుత ప్రభుత్వం ధరణిని రద్దు చేసి, భూభారతి చట్టం తీసుకువచ్చింది. అయితే ఈ చట్టంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బాధిత రైతులకు నిరాశే మిగులుతోంది. నెలలు గడుస్తున్నా సమస్యలు అపరిష్కృతంగానే ఉండడంతో నిట్టూరుస్తున్నారు.
భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది. రాష్ట్రంలో నాలుగు మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి రైతులనుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఇందులో లింగంపేట మండలం ఒకటి. మండలంలో ఏప్రిల్లో భూభారతి సదస్సులు నిర్వహించి, రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. 4,225 దరఖాస్తులు వచ్చాయి. అనంతరం సర్వే బృందాలు క్షేత్రస్థాయిలో సమస్యను పరిశీలించాయి. దీర్ఘకాలంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఎక్కువగా అసైన్మెంట్ భూములు, రెవెన్యూ, అటవీ శాఖ మధ్య వివాదాలకు సంబంధించినవే ఉన్నాయి. వీటిని ఇరు శాఖల సమన్వయంతో సర్వే నిర్వహించి పరిష్కరిస్తామని అధికారులు చెప్పారు. కానీ రెండు నెలలు గడుస్తున్నా సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. మండలంలో 4,225 దరఖాస్తులు రాగా ఇప్పటివరకు 600 లోపే పరిష్కరించారు. ఇందులో పేర్లు సరిచేయడం, మిస్సింగ్ సర్వే నంబర్లు, భూమి ఆన్లైన్లో నమోదు కానివి, సాదాబైనామాలు, వారసత్వం భూములు తదితర సమస్యలు సరిచేశారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను రెవెన్యూ అధికారులు పక్కన పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాతలు, తండ్రులనుంచి వారసత్వంగా వచ్చిన భూముల సమస్యలూ పరిష్కారానికి నోచుకోవడం లేదు. అలాగే ఒకే సర్వే నంబర్లో పలువురు రైతుల భూములు ఉండగా.. ధరణి పోర్టల్ తీసుకువచ్చాక అందులో ఒకరి భూమి మరొకరిపై నమోదయ్యింది. వన్ ‘బి’, అడంగల్ పహణీలో ఒకరి పేరు ఉంటే ధరణిలో ఇచ్చిన పాసుబుక్కులో మరొకరి పేరుపై రావడంతో రైతులు రైతుబంధు, రైతు భరోసా, రైతు బీమాలకు దూరమయ్యారు. సమస్యలు పరిష్కారం కాని రైతులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ విషయమై తహసీల్దార్ను వివరణ కోరగా క్షేత్ర స్థాయిలో పరిశీలించి విచారణ చేసి సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. పెండింగ్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు.
భూభారతితోనూ తీరని సమస్య
పైలట్ ప్రాజెక్టు మండలంలో
4,225 దరఖాస్తులు
అరకొరగానే పరిష్కారాలు..
తహసీల్ కార్యాలయం చుట్టూ
తిరుగుతున్న బాధిత రైతులు
అధికారులు న్యాయం చేయాలి
మోతె శివారులోని 324 సర్వే నంబర్లో నాకు 2.33 ఎకరాల భూమి ఉంది. ధరణి పాసుబుక్కులో 33 గుంటల భూమే నమోదయ్యింది. వారసత్వంగా వచ్చిన రెండెకరాలు నమోదు కాలేదు. అదే సర్వే నంబరులోని ఆవుల రాజయ్య పేరుతో రెండు ఎకరాలు వచ్చింది. నా భూమి ఇతరుల పేరుపై నమోదు కావడంతో సంక్షేమ పథకాలకు దూరమయ్యాను. అధికారులు న్యాయం చేయాలి.
– మచ్చ సతీశ్, మోతె
ప్రభుత్వ పథకాలు అందడంలేదు
సర్వే నంబర్ 326/అలో నాలుగు ఎకరాల భూమి ఉంది. నాకు వారసత్వంగా వచ్చిన భూమి ఇది. ధరణి వచ్చాక అదే సర్వే నంబరులో ఉన్న దేమాంగు సిద్దవ్వ పేరుపైకి రెండు ఎకరాలు మారింది. అదే సర్వే నంబర్లో బొల్ల సాయిలు పేరుతో ఎకరం భూమి వచ్చింది. 1బి, పహణీలో నా పేరు చూపిస్తున్నా ఆన్లైన్లో పట్టా మాత్రం ఇతరుల పేరుపై చూపిస్తోంది. నా సమస్య పరిష్కరించాలి.
– పూరం మల్లయ్య, మోతె
33 ఏళ్లుగా సాగు చేస్తున్నా
1992లో ఎర్రాపహడ్కు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి 2.20 ఎకరాల భూమి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నా. అడంగల్ పహణీలో నా పేరుపైనే ఉండేది. 2016–17 సంవత్సరంలో నాకు భూమి అమ్మిన వ్యక్తుల పేరుపైకి మార్చారు. ఈసీలో మాత్రం సత్యంనాయుడు పేరే చూపిస్తుంది. ఈ సమస్యపై భూభారతిలో దరఖాస్తు చేసుకున్నా. అధికారులు నా భూమి నాకు వచ్చేలా చూడాలి.
– సత్యంనాయుడు, బూరుగిద్ద

భూసమస్యలకేదీ పరిష్కారం!

భూసమస్యలకేదీ పరిష్కారం!

భూసమస్యలకేదీ పరిష్కారం!

భూసమస్యలకేదీ పరిష్కారం!