తొలగనున్న ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుల నీటి కష్టాలు
గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణానది సుమారు 93 కిలోమీటర్ల మేర పారుతుంది.. కృష్ణాబేసిన్ పరిధిలోనే 9 లక్షల ఎకరాల ఆయకట్టుతో వివిధ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు చేశారు. ఏటా వానాకాలం ఖరీఫ్ సీజన్లో ఈ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగునీటిని అందిస్తున్నారు. ఈ ప్రాజెక్టులన్నింటికీ పెద్దన్నగా ఉన్న జూరాల ప్రాజెక్టు జలాశయం నుంచి నీటిని తరలిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అయితే ఇదే ప్రాజెక్టుల కింద రబీ సీజన్లో నీటికష్టాలు తలెత్తుతున్నాయి. పెద్దన్నగా చెప్పుకొనే జూరాల జలాశయం నీరులేక అడుగంటిపోవడమే ప్రధాన కారణం. దీంతో ఏటా తాగునీటి అవసరాలకు సైతం పైనున్న కర్ణాటకను ప్రాధేయపడాల్సి వస్తుంది. ఈ క్రమంలో నీటి కష్టాలను అధిగమించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించింది. జూరాల జలాశయానికి సమీపంలో నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో నిర్మించిన గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం జలాశయం 1.5 టీఎంసీలు కాగా.. దీనిని 15 టీఎంసీలకు పెంచేందుకు సర్వే ప్రక్రియ పూర్తయి డీపీఆర్ను సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి కష్టాలు తొలగనున్నాయి.
గుడ్డెందొడ్డి రిజర్వాయర్
రిజర్వాయర్ పెంపు సర్వే పనులు చేస్తున్న అధికారులు (ఫైల్)
1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంపు
వరద సమయంలో రోజుకు అర టీఎంసీ ఎత్తిపోసేలా చర్యలు
రబీ సీజన్లో రివర్స్ పంపింగ్ విధానంలో జూరాల జలాశయంలోకి ఎత్తిపోత
సర్వే పనులు పూర్తి.. త్వరలోనే ప్రభుత్వానికి డీపీఆర్ నివేదిక


