అచ్చంపేట: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈ ప్రక్రియ గురువారం నుంచి వచ్చేనెల 24 వరకు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టింది. ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు (ఈఆర్ఓలు), అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు(ఏఈఆర్ఓఎస్), బూత్లెవల్ అధికారులు (బీఎల్ఓ)లను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చి సన్నాహక సమావేశాలు నిర్వహించి సన్నద్ధం చేసింది. బుధవారం మండలాల వారీగా చివరగా బీఎల్ఓలకు శిక్షణ ఇచ్చి గురువారం నుంచి ఇంటింటికి వెళ్లేలా సన్నద్ధం చేశారు. బీఎల్ఓలు ఇంటింటికి తిరిగి 2002, 2025 ఓటర్ల జాబితాను పోల్చి చనిపోయిన, డూప్లికేట్, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను తొలగించి స్థానికంగా నివశిస్తున్న అర్హుల పేర్లను యాప్లో అప్లోడ్ చేయనున్నారు.
బీఎల్ఓల పాత్ర కీలకం..
కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జిల్లాలో గురువారం నుంచి ఇంటింటి సర్వే చేయనున్నారు. ఓటరు జాబితా సవరణలో ఇంటింటి ధ్రువీకరణ ప్రక్రియ అత్యంత ముఖ్యమైంది. దీనిలో బీఎల్ఓల పాత్ర ఎంతో కీలకం కానుంది. జూలై 24 నాటికి పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ, 31న ఓటర్ల ముసాయిదా విడుదల, జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారంపై నోటీసుల జారీ, అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురణ ఉంటుంది. చనిపోయిన వారు, డూప్లికేట్, శాశ్వతంగా వలస వెళ్లినవారు, అనర్హుల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించి.. అర్హులతో మాత్రమే తుది జాబితా రూపొందిస్తారు.
ఉమ్మడి జిల్లాలో 80.15 శాతమే..
ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో ప్రస్తుతం మొత్తం 27,39,12 లక్షల మంది ఓటర్లున్నారు. ఇందులో 21,95,269 (80.15 శాతం) ఓటర్ల మ్యాపింగ్ పూర్తయింది. సర్–2002తో భాగంగా మ్యాపింగ్ చేయగా ఏకంగా 9,16,059 మంది ఓటర్లకు సంబంధించిన వివరాలు అందుబాటులో లేవు. ఇందుకోసం మండలాల్లో స్పెషల్ హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి వారికి సంబంధించిన 2002 ఓటరు జాబితా ఈపీఐసీ నంబర్ కోసం వెతుకుతున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక బీఎల్ఓను నియమించారు. వీరంతా నెల రోజుల్లో ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించనున్నారు. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ తక్కువగా నమోదు కావడానికి మెజార్టీ ఓటర్లు సొంత గ్రామంలో నమోదు చేయించుకుంటామని చెప్పడమే ప్రధాన కారణం. 2002, 2025 ఓటర్ల జాబితాల్లో పేర్లు ఉంటే.. ఓటర్లు ఆధారాల కోసం ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు చూపాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాపింగ్లో ధ్రువపత్రాలు సమర్పించాల్సిన వారు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్న 11 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకోవచ్చు..
ఓటర్లకు ముందుగా ముద్రించిన ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తారు. ఇంటింటి సర్వే సందర్భంగా బీఎల్ఓలు వచ్చినప్పుడు పూర్తి వివరాలతో ఎన్యుమరేషన్ ఫారం సమర్పించి తప్పనిసరిగా రశీదు తీసుకోవాలి. ఇల్లు తాళం వేసి ఉంటే బీఎల్ఓలు మూడుసార్లు సందర్శిస్తారు. డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేకపోతే ఫారం–6 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 31న డ్రాఫ్ట్ ఎస్ఐఆర్ ఓటరు జాబితాను విడుదల చేస్తాం. ప్రతి ఓటరు తన పేరు డ్రాఫ్ట్ జాబితాలో ఉందో.. లేదో.. పరిశీలించి, అభ్యంతరాలు లేదా కొత్త క్లెయింలు ఉంటే ఆగస్టు 30లోగా సమర్పించాలి. సెప్టెంబర్ 28 నాటికి అన్ని అభ్యంతరాలు పరిష్కరించి అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల చేస్తాం.
– హేమంత కేశవ్ పాటిల్,
కలెక్టర్, నాగర్కర్నూల్
నేటినుంచి ఓటరు జాబితా ఇంటింటి సమగ్ర సవరణ
ఇప్పటికే బూత్లెవల్ అధికారులకు శిక్షణ పూర్తి
ఉమ్మడి జిల్లాలో 80.15 శాతం పూర్తయిన మ్యాపింగ్
జూలై 24 వరకు ప్రక్రియ ముగించేలా కసరత్తు
31న ముసాయిదా, అక్టోబర్ 1న తుది జాబితా ప్రచురణ


