● జిల్లాలో పెరుగుతున్న కుక్కకాటు కేసులు
● గడిచిన మూడు నెలల్లో 429 మందిపై దాడి
● తాజాగా జమ్మిచేడ్లో 10 మందిపై దాడి
● ఆరుబయటకు రావాలంటేనే జంకుతున్న జనం
● పూర్తిస్థాయిలో నిలువరించలేకపోతున్న అధికారుల కట్టడి చర్యలు
గద్వాల క్రైం: జిల్లాలో వీధికుక్కలు చెలరేగిపోతున్నాయి. ఆరుబయట కనబడిన వారిపైనల్లా అమాంతం ఎగబడి దాడులు చేస్తున్నాయి. ఇంటి ఆవరణ.. రోడ్డు మార్గంలో.. వీధుల్లో ఎక్కడ చూసినా వీధి కుక్కల బెడద తప్పడం లేదు. జిల్లాలో గత కొన్ని రోజులుగా కుక్కలు మనుషులపై దాడులు చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. విచక్షణారహితంగా కరిచే కుక్క కాటుతో వచ్చే (రేబిస్ వ్యాధితో మరణం) ప్రమాదాన్ని గుర్తెరిగి ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. తాజాగా మంగళవారం ఉదయం జమ్మిచేడ్ కాలనీలో ఓ పిచ్చి కుక్క కనిపించిన వారిపైనల్లా విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ దాడిలో 10 మందికిపైగా తీవ్ర రక్తగాయాల పాలైన సంఘటన తీవ్ర కలకలం రేపింది. గడిచిన మూడు నెలల వ్యవధిలో 429 మందికిపైగా కుక్కలు దాడులు చేశాయి. మరోవైపు గద్వాల మున్సిపల్ అధికారులు వీధికుక్కలను నిలువరించేందుకు 8 మంది సిబ్బందిని ఏర్పాటు చేసి 60 కుక్కలను కట్టడి చేసినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.


