గట్టు: రాయాపురం స్టేజీ డబుల్ రోడ్డు వద్ద వంతెన నిర్మాణం చేపట్టాలని, భారత్మాల రోడ్డు నుంచి గట్టు మండలానికి కనెక్టివటీ ఇచ్చే అఫ్రోచ్ రోడ్డు నిర్మించాలని గట్టు, రాయాపురం, ఆలూరు, తుమ్మలచెరువు గ్రామస్తులు డిమాండ్ చేశారు. పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు రాముడు ఆధ్వర్యంలో నాలుగు గ్రామాల ప్రజలు చేపట్టిన రిలే నిరసన దీక్షలు ఆది వారం నాటికి 126వ రోజుకు చేరుకున్నాయి. రా యాపురం స్టేజీ వద్ద డబుల్ రోడ్డు మూసివేసి, రాకపోకలు లేని పాత ఆలూరు రోడ్డులో తక్కువ ఎత్తు లో వంతెన నిర్మాణం సాగించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు ఆరోపించారు. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, భారీ వాహానాలు ఈ వంతెన ద్వారా రాకపోకలను సాగించే అవకాశం లేదన్నారు. రవాణా సౌకర్యాలు తక్కువగా ఉన్న గట్టు మండలంలో ఆరు వరుసల జాతీయ రహదారికి కనెక్టివిటీ ఏర్పాటు చేస్తే, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కార్యక్రమంలో మహాదేవప్ప, అమ్మన్న, వీరేష్, వెంకటన్న, తిమ్మప్ప, కృష్ణయ్య, సాలె కర్రెప్ప, జనార్దన్, సుధాకర్ పాల్గొన్నారు.
రాయాపురం స్టేజీ వద్ద ఆందోళన చేస్తున్న ప్రజలు


