భూ భారతి దరఖాస్తులు పరిష్కరించాలి
గద్వాల: జిల్లాలో భూ భారతి దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ ఆర్డీఓ స్థాయిలోనే 1,370 భూభారతి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని సంబంధిత మండలాల రెవెన్యూ అధికారులు సైతం తమ పరిధిలోని భూభారతి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలన్నారు. కుల, ఆదాయ తదితర ధ్రువీకరణ పత్రాలతోపాటు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని చెప్పారు. ల్యాండ్ సర్వే విషయంలో నిర్లక్ష్యం వహించకుండా లైసెన్స్ సర్వేయర్లతో పూర్తి చేయాలన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సరవణ ప్రక్రియ వేగవంతంగా చేపట్టాలన్నారు. ఎస్ఆర్ మ్యాపింగ్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి చేయాలన్నారు. సూపర్వైజర్లు, బీఎల్ఓలు రెవెన్యూ అధికారులు సహకరించాలని సూచించారు. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలను తహిసీల్దార్లు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని కోరారు. విధుల్లో అలసత్వం వహించే అధికారులను ఉపేక్షించేది లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, సర్వే ఏడీ నూకరాజు, తహసీల్దార్లు పాల్గొన్నారు.


