
‘అసమగ్ర’ ఐటీడీఏ
సిబ్బంది, నిధులకు నోచుకోని గిరిజనాభివృద్ధి సంస్థ
గతంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ కార్యాలయం మినీ కలెక్టరేట్ను తలపించేంది. సున్నిపెంట కేంద్రంగా ఉన్నప్పుడు వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో కళకళలాడింది. ఐటీడీఏ పీఓతోపాటు గిరిజన, వ్యవసాయ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఉపాధి హామీ, విద్యుత్ తదితర శాఖల అధికారులు కార్యాలయంలో అందుబాటులో ఉండేవారు. చెంచులు, గిరిజనుల ఆర్థికాభివృద్ధి, సాధికారత కోసం ఎకనామిక్ సపోర్ట్ స్కీం అమలు చేసేవారు. కానీ, నాలుగేళ్లుగా ఐటీడీఏ ప్రాజెక్ట్కు ఎలాంటి నిధులు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. రెగ్యులర్ పీఓ సహా ఇతర అధికారులు ఎవరూ లేక, సిబ్బంది లేకపోవడంతో చెంచులు, గిరిజనులు సైతం కార్యాలయానికి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో నల్లమల లోతట్టు ప్రాంతాల్లోని చెంచులు ప్రభుత్వ పథకాలు, ఆర్థిక ప్రోత్సాహకాలకు నోచుకోలేకపోతున్నారు. వారి జీవనోపాధికి ఉపకరించే పథకాలు, కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అందడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం, ఉపాధి హామీ పనులు, అంగన్వాడీ సరుకులపై మాత్రమే చెంచులు ఆధారపడి జీవించాల్సి వస్తోంది. చెంచుల ఉపాధి, జీవనాభివృద్ధి కోసం ఉద్దేశించిన గిరివికాసం, ఈఎస్ఎస్, గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అటవీ ఉత్పత్తుల సేకరణ తదితర పథకాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు.
గతమెంతో ఘనం..
● ఒకే ఒక్క ఉద్యోగితో కొనసాగుతున్న మన్ననూరు కార్యాలయం
● ఏళ్లతరబడిగా ఇన్చార్జ్ పీఓతోనే నెట్టుకొస్తున్న వైనం
● అగమ్యగోచరంగా చెంచులు, గిరిజనుల జీవనం
● నల్లమలలోని అడవి బిడ్డలకు అందని ఆర్థిక ప్రోత్సాహకాలు
నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచులు, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన మన్ననూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ నిధులు, సిబ్బంది లేక నామమాత్రంగా తయారైంది. అత్యంత దుర్భర పరిస్థితుల్లో ఉన్న గిరిజన జాతులు (పర్టిక్యూలర్లీ వల్నరేబుల్ ట్రైబల్ గ్రూప్స్– పీవీటీజీ), చెంచులు, గిరిజనుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి కోసం ఏర్పాటైన ఐటీడీఏ ప్రాజెక్ట్లో దశాబ్ద కాలంగా రెగ్యులర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (పీఓ) లేకపోవడం ఇక్కడి గిరిజనుల పాలిటశాపంగా మారింది. అత్యంత కీలకమైన పీఓ పోస్టు ఖాళీగా ఉండటం, ఏళ్లుగా ఇన్చార్జ్తోనే నెట్టుకొస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ కింద కార్యకలాపాలు మందగించాయి. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతులమీదుగా జిల్లాలో ఇందిరా సౌర జల వికాసం పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద చెంచులకు ఉచితంగా సోలార్ బోర్ ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఈ కార్యక్రమం పకడ్బందీగా అమలు కావాలన్నా పూర్తిస్థాయి సిబ్బంది నియామకం చేపడితేనే అది సాధ్యమవుతోంది.
ఏళ్లుగా ఒక్కరే దిక్కు..
ఉమ్మడి రాష్ట్రంలో ఐటీడీఏ సున్నిపెంట (శ్రీశైలం) పరిధిలో కార్యకలాపాలు కొనసాగగా.. 2014లో రాష్ట్ర విభజన అనంతరం నాగర్కర్నూల్ జిల్లాలోని మన్ననూర్లో ఐటీడీఏ ప్రాజెక్ట్ ఏర్పాటైంది. అయితే గడిచిన 11 ఏళ్లుగా ప్రభుత్వం రెగ్యులర్ పీఓను మాత్రం నియమించలేదు. ప్రాజెక్ట్ అధికారిగా ఐఏఎస్ స్థాయి అధికారిని నియమించాల్సి ఉండగా, ఇన్నేళ్లుగా తాత్కాలికంగా, జిల్లాస్థాయి అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ నెట్టుకొస్తోంది. పీఓతోపాటు కార్యాలయంలో వివిధ విభాగాలకు అధికారులు, కార్యాలయ నిర్వహణకు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, సూపరింటెండెంట్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు తదితర పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా, కేవలం సీనియర్ అసిస్టెంట్ స్థాయిలో ఒక్కరు మాత్రమే పనిచేస్తున్నారు. మిగతా ఏ ఒక్క అధికారి కూడా లేకపోవడంతో ఐటీడీఏ ప్రాజెక్ట్ నామమాత్రంగా మారింది.
పీఎం జన్మన్కే పరిమితం..
చెంచు పెంటల సంఖ్య
150
చెంచుల జనాభా (సుమారు) 18,000
మన్ననూరు ఐటీడీఏ పరిధిలోని ఉమ్మడి జిల్లాలు 3 (మహబూబ్నగర్,
రంగారెడ్డి, నల్లగొండ)
చెంచులు, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ఏర్పాటు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) నిస్సహాయత చాటుతోంది. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు సంబంధించి మన్ననూరులో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు కనీసం పూర్తిస్థాయి పీఓకు నోచుకోలేకపోతోంది. దీనికితోడు నిధులు కేటాయించక, ఇతర సిబ్బందిని నియమించకపోవడంతో సదరు కార్యాలయం ఒకేఒక్క ఉద్యోగితో నెట్టుకొస్తోంది. ఇన్ని ఆటుపోట్ల మధ్య సాగుతున్న ఐటీడీఏ ఇక చెంచు, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి ఏమాత్రం తోడ్పాటునందిస్తుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. – సాక్షి, నాగర్కర్నూల్
ప్రభుత్వానికి ప్రతిపాదించాం..
మన్ననూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ రెగ్యులర్ పీఓ, ఇతర సిబ్బంది నియామకం కోసం ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపాం. ప్రస్తుతం పీఎం జన్మన్ కింద చెంచుల్లోని ప్రతి ఒక్కరికి అవసరమైన పత్రాలను అందించేందుకు కార్యక్రమాలను కొనసాగిస్తున్నాం. మొబైల్ మెడికల్ యూనిట్ల ద్వారా వైద్యసేవలు ప్రారంభించాం.
– రోహిత్ గోపిడి,
ఐటీడీఏ ఇన్చార్జి పీఓ, మన్ననూర్
అత్యంత దుర్భర పరిస్థితుల్లో ఉన్న గిరిజనులు (పీవీటీజీ) గ్రూప్నకు చెందిన చెంచులకు ప్రభుత్వ ప్రయోజనాలు అందించేందుకు వీలుగా పీఎం జన్మన్ కార్యక్రమాన్ని కేంద్రం చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో పీఎం కిసాన్, ఆయుష్మాన్ భారత్, జాతీయ ఉపాధి హామీ పథకం తదితర పథకాల ప్రయోజనాలను పొందేందుకు అవసరమైన ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం, జన్ ధన్ బ్యాంకు ఖాతా వంటి మౌలికమైన పత్రాలను ప్రతి ఒక్క చెంచు వ్యక్తికి అందించాల్సి ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా శిబిరాలను నిర్వహించి అవసరమైన పత్రాలను అధికారులు అందజేస్తారు. ఈ కార్యక్రమం మినహా గిరిజనుల కోసం ఉద్దేశించిన ఇతర ఏ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదు.
చెంచులు ఉండే
మండలాలు
25

‘అసమగ్ర’ ఐటీడీఏ