ముందస్తు వరద | - | Sakshi
Sakshi News home page

ముందస్తు వరద

Jun 17 2025 5:20 AM | Updated on Jun 17 2025 5:20 AM

ముందస్తు వరద

ముందస్తు వరద

అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయానికి ముందస్తుగా జూన్‌లోనే వరద వస్తుండటంతో ఆయకట్టు రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం ముందుగా కాల్వలకు సాగునీరు విడుదల చేస్తే పొలాలు దుక్కి దున్నడం, కరిగెట చేసుకోవడం వంటి పనులు చేపట్టేందుకు ఆయకట్టు రైతులు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం వరి నారుమడులను సిద్ధం చేసుకుంటూ ఎప్పుడు నీరు వదులుతారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. గతేడాది యాసంగిలో ప్రాజెక్టులో నిల్వ నీటిమట్టం తక్కువగా ఉండటంతో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ముందస్తుగా ఎడమ, కుడికాల్వ ఆయకట్టును కుదించి కేవలం 35 వేల ఎకరాలకే పరిమితం చేసి సాగునీటిని అతి కష్టం మీద అందించగలిగింది. దీంతో పంటలకు దూరంగా ఉన్న చివరి ఆయకట్టు రైతులు వానాకాలం సాగుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం సన్నాలకు బోసన్‌ చెల్లిస్తుండటంతో ఆయకట్టులో కేవలం సన్నరకం వరిని మాత్రమే సాగు చేసేందుకు తమ పొలాలను సిద్ధం చేస్తున్నారు. ప్రాజెక్టులో నీరు ఉన్నప్పుడే పొలాలకు అందిస్తే సాగు పనులు మొదలు పెడతామని.. అధికారులు గుర్తించాలని వేడుకుంటున్నారు. ఎగువ నుండి ప్రాజెక్టుకు వరద వస్తుండటంతో జూన్‌లోనే నిండుకుండను తలపిస్తున్న తరుణంలో ఆయకట్టు సాగుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

ఆయకట్టు పరిధి ఇలా..

జూరాల ఎడమ కాల్వ కింద అమరచింత, ఆత్మకూర్‌, మదనాపురం, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల్లో మొత్తం 85 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఏటా రెండు పర్యాయాలు వరి సాగు చేసే రైతులు గత కొంతకాలంగా యాసంగిలో వారబందీ విధానంలో సాగునీరు వదులుతుండటంతో వరితో పాటు చెరుకు సాగుపై రైతులు దృష్టి సారించారు. అధికారుల సూచన మేరకు రైతులు సాగునీటిని పొదుపుగా వినియోగిస్తుండటంతో కోతల సమయం వరకు నీరందుతోంది.

● గతేడాది యాసంగిలో ఎడమ కాల్వ పరిధిలో అధికారులు రామన్‌పాడు రిజర్వాయర్‌ వరకు ఉన్న అమరచింత, ఆత్మకూర్‌ మండలాల్లోని 20 వేల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే సాగునీరు అందించారు. ఈసారి వానాకాలంలో చివరి ఆయకట్టు వరకు పూర్తిస్థాయిలో నీరు అందించేందుకు ప్రాజెక్టు అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకొని ఈ విషయాన్ని ఇది వరకే ఉన్నతాధికారులకు విన్నవించారు. రాష్ట్రస్థాయిలో సమావేశం నిర్వహించి నీటి పారుదలశాఖ మంత్రి ఆదేశాలతో చివరి వారంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

జూరాల ఎడమ కాల్వ పరిధిలో చాలామంది రైతులు ఇది వరకే వరి నారు పోసుకున్నారు. అకాల వర్షాలు, ముందస్తు వానలు కురవడంతో ఎగువ నుంచి జలాశయానికి వరద భారీగా చేరుతుండటంతో ఆయకట్టుకు ముందస్తుగా సాగునీరు వదులుతారనే ఆశతో రైతులు తమ పొలాలను చదును చేసుకుంటూ నీటిరాక కోసం ఎదురు చూస్తున్నారు.

ఉన్నతాధికారుల నిర్ణయం మేరకే..

జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద వస్తుండటంతో వానాకాలం పంటల సాగుకు త్వరగా సాగునీరు అందించాలనే ఆలోచనను ఉన్నతాధికారులకు విన్నవించాం. రాష్ట్రస్థాయిలో ఇరిగేషన్‌ అధికారులతో మంత్రి సమీక్ష అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా నెలాఖరు నాటికి కాల్వలకు సాగునీరు వదిలే అవకాశాలు ఉన్నాయి.

– జగన్మోహన్‌, ఈఈ, జూరాల ఎడమకాల్వ విభాగం

నారుమడులు సిద్ధం..

జూరాలకు మొదలైన ప్రవాహం

నెలాఖరున కాల్వలకు విడుదల చేసే అవకాశం

వానాకాలం వరి సాగుకు ఆయకట్టు రైతులు సన్నద్ధం

ప్రాజెక్టులో ప్రస్తుతం 8.184 టీఎంసీల నీరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement