
ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి
గద్వాల: వివిధ సమస్యలపై ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయొద్దన్నారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారమార్గం చూపాలన్నారు. పరిష్కారం కాని పక్షంలో అందుకు గల కారణాలను ఫిర్యాదుదారుడికి తెలియజేయాలని సూచించారు. కాగా, ప్రజావాణిలో 55 ఫిర్యాదులు అందగా.. ఆయా శాఖల అధికారులకు పంపించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత
రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలుచేస్తూ.. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. సోమవారం సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన రైతునేస్తం ముఖాముఖిలో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం రైతులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులతో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. వరి, పత్తి వంటి సంప్రదాయ పంటలే కాకుండా కూరగాయలు, పండ్లతోటలు, వాణిజ్య పంటలు పండించాలని సూచించారు. పంటల సాగులో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సలహాలు, సూచనలు పాటించాలన్నారు. ముఖ్యంగా వ్యవసాయ భూమిని సంరక్షించుకుంటూ.. పర్యావరణానికి హాని కలగకుండా చూడటం ఎంతో ముఖ్యమన్నారు. కార్యక్రమంలో డీఏఓ సక్రియా నాయక్, ఏఓ ప్రతాప్, తహసీల్దార్ మల్లిఖార్జున్, ఏఈఓ అనూష పాల్గొన్నారు.