
ముందు జాగ్రత్తలతోనే డయేరియా నివారణ
గద్వాల క్రైం: ఐదేళ్లలోపు చిన్నారులు డయేరియాకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఇన్చార్జి వైద్యాధికారి సిద్ధప్ప సూచించారు. సోమవారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో స్టాఫ్ డయేరియా ప్రోగ్రాం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారుల ఆరోగ్య సమస్యలపై ఆశావర్కర్లు ఇంటింటి సర్వే నిర్వహించాలని తెలిపారు. తల్లుల ఆరోగ్య వివరాలతో పాటు తల్లిపాల ప్రముఖ్యత, పిల్లలకు అందించాల్సిన టీకాలు తదితర ఆరోగ్య విషయాలను వివరించాలని సూచించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్లాలన్నారు. అత్యవసర వైద్య సదుపాయం కోసం జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేయాలని సూచించారు. అనంతరం స్టాఫ్ డయేరియా ప్రోగ్రాంకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇందిరా, వైద్యులు తన్వీర్ రిజ్వానా, ప్రసూన్నరాణి, శ్యామ్, అశోక్ పాల్గొన్నారు.
పోలీసు ప్రజావాణికి 20 ఫిర్యాదులు
గద్వాల క్రైం: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. భూ వివాదాలు, ఆస్తి తగాదాలు, అప్పుగా తీసుకున్న వ్యక్తులు డబ్బులు చెల్లించడం లేదని.. ఇలా 20 మంది ఫిర్యాదు అందించినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా ఆయా సమస్యలకు పరిష్కారం చూపుతామని ఎస్పీ బాధితులకు భరోసా ఇచ్చారు. సివిల్ సమస్యలను కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవాలని సూచించారు.
దరఖాస్తు చేసుకోండి
గద్వాల: దివ్యాంగులు అవసరమైన ఉపకరణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ అధికారిణి డి.సునంద సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దివ్యాంగులకు రెట్రోపిటెడ్ మోటారైజ్డ్ వాహనాలు, బ్యాటరీ వీల్చైర్స్, మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిల్స్, హైబ్రిడ్ వీల్చైర్ అటాచ్మెంట్, వీల్చైర్, ల్యాప్టాప్స్, 4జీ స్మార్ట్ఫోన్స్, ట్రైసైకిల్స్, క్యాలిపర్స్, వాకింగ్ స్టిక్స్, బ్రెయిలీ బుక్స్, టీచింగ్ లర్నింగ్ మెటీరియల్, ఎంఆర్సీ చప్పల్స్ ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అవసరమున్న వారు obmms.cgg.gov.in వెబ్సైట్లో ఈ నెల 18వ తేదీలోగా సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ దరఖాస్తు ఫారాలతో పాటు సదరం సర్టిఫికెట్, ఆధార్, విద్య, ఆదాయ, కుల ధ్రువపత్రాలు, తెల్లరేషన్కార్డు వంటి పత్రాలను కలెక్టరేట్లోని మహిళా శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమశాఖ జిల్లా కార్యాలయంలో సమర్పించాలన్నారు. పూర్తి వివరాలకు 90101 61406 నంబర్కు సంప్రదించాలని తెలిపారు.
ఉచితంగా
సివిల్ సర్వీసెస్ కోచింగ్
గద్వాల: సివిల్ సర్వీసెస్–2026పై ఆసక్తిగల అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ అందించనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రాములు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు www.tgbcstudyc ircle.chg.gov.in వెబ్సైట్లో జూలై 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూలై 25 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు 9 నెలలపాటు కోచింగ్ అందించనున్నట్లు పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులను రిజర్వేషన్ ప్రకారం ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఎంపికై న 100 మంది అభ్యర్థులకు భోజన వసతి, రవాణా ఖర్చులకు ప్రతినెలా రూ. 5వేలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులకు లైబ్రరీ వసతి ఉంటుందన్నారు. అర్హత పరీక్ష జూలై 12న నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 08546–293022, 99854 34941 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
‘రైతుభరోసా’కు అవకాశం
గద్వాల: కొత్తగా పట్టాదారు పాస్పుస్తకాలు పొందిన వారు రైతుభరోసా పథకంలో పేర్లు నమోదు చేసుకోవాలని డీఏఓ సక్రియానాయక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల్లో కొత్తగా 4,451మంది రైతులకు పట్టాదారు పాస్పుస్తకాలు వచ్చినట్లు గుర్తించామన్నారు. వీరందరూ కూడ భూమి పాస్పుస్తకం, ఆధార్కార్డు, బ్యాంకు అకౌంట్ జిరాక్స్తో ఈ నెల 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.