గద్వాల టౌన్: జిల్లాలో 10వ తరగతి పరీక్షల నిర్వహణ కష్టంగా మారింది. ప్రభుత్వం కేంద్రాలకు నిధుల కేటాయింపులో భారీస్థాయిలో కోత విధించడంతో పర్యవేక్షకులు చేతి నుంచి డబ్బులు చెల్లించే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇస్తున్న నిధులు ఏడురోజులపాటు జరిగే పరీక్షల సమయంలో తాగునీటి వసతి కల్పించడానికే సరిపోతుందని వాపోతున్నారు. ఫలితంగా సర్కారు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కడైనా టీ తాగాలంటే రూ.10 ఖర్చు చేయాల్సి వస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థికి పరీక్ష నిర్వహణ కోసం మొక్కుబడిగా నిధులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ఏటా పరీక్షలకు ముందు ఈ వాదన ముందుకు వస్తున్నా ప్రభుత్వ తీరులో మాత్రం మార్పు రావడం లేదు.
నిధుల కేటాయింపులో అన్యాయం..
పదో తరగతి పరీక్షలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 45,837 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామంటున్న ప్రభుత్వం నిధుల కేటాయింపులో మాత్రం శాసీ్త్రయంగా వ్యవహరించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థి నుంచి పరీక్ష ఫీజు కింద రూ.125 వసూలు చేసే ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు మాత్రం కేవలం రూ.8.25 మాత్రమే ఇస్తున్నారు. ఈ లెక్కన రోజుకు వెచ్చిస్తున్నది రూ.1.17 మాత్రమే. ఇక ఇంటర్మీడియట్ బోర్డు పరీక్ష నిర్వహణకు ఒక్కో విద్యార్థికి రూ.10 కేటాయిస్తోంది. పదో తరగతి విద్యార్థులకు తక్కువగా కేటాయించడం ఎంతవరకు సమంజసమని పరీక్షల నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థికి కనీసం రూ.20 కేటాయించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
పరీక్షల నిర్వహణకు ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం రూ.8.25 ఇస్తుంది. ఇందులోనే విద్యార్థులకు ప్రతిరోజూ కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది. రోజుకు ఐదారు క్యాన్లకు గాను రూ.100 వరకు ఖర్చవుతుంది. ఏడురోజులకు రూ.700 వరకు వ్యయం చేయాల్సి వస్తుంది. కొన్నిచోట్ల తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
తాగునీటికే సరిపోవడం లేదు..
వసతుల కల్పనకు వేధిస్తున్న నిధుల కొరత
ఫీజు వసూలు చేస్తున్నా.. కేంద్రాలకు కేటాయించని వైనం
తలలు పట్టుకుంటున్న పర్యవేక్షకులు
రూ.20కు పెంచాలి..
పరీక్షల నిర్వహణ నిధులు పెంచాలని పలుమార్లు ప్రభుత్వానికి చెప్పినా ఫలితం లేకుండా పోతుంది. ఒక్కో విద్యార్థికి కనీసం రూ.20 ఇవ్వాలి. తక్కువ నిధులు ఇవ్వడం వల్ల పదో తరగతి పరీక్ష ఇన్విజిలేషన్కు ఉపాధ్యాయులు ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం అన్ని ధరలు పెరిగాయి. ఇన్విజిలేటర్లకు రోజుకు కేవలం రూ.33 ఇవ్వడం బాధాకరం. దీన్ని రూ.150కు పెంచాలి. ఉన్నతాధికారులు ఇప్పటికై నా పునరాలోచించాలి. – గోపాల్,
యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి, గద్వాల
మార్గదర్శకాల ప్రకారమే..
ప్రభుత్వ మార్గదర్శకాలు, వచ్చిన బడ్జెట్ ఆధారంగానే చెల్లింపులు జరుగుతాయి. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. నిధుల పెంపు అనే దానిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. – అబ్దుల్ఘని, డీఈఓ
పరీక్షల నిర్వహణ.. కత్తిమీద సామే
పరీక్షల నిర్వహణ.. కత్తిమీద సామే