ఇటిక్యాల: ఉపాధి హామీ పథకం పనులు చేపడుతున్న ప్రాంతాల్లో కూలీలకు కనీస వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం ఇటిక్యాల సమీపంలో పెద్దదిన్నె రోడ్డు, లింగమ్మచెరువు కట్ట వద్ద చేపట్టిన ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఉపాధి పని కొలతలను పక్కాగా నమోదు చేయాలని.. 80 పనిరోజులు పూర్తిచేసిన కూలీలకు 100 రోజులు ఉపాధి పనులు పూర్తిచేసే అవకాశం కల్పించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఏవీఓ శ్రీనివాస్, ఎంపీడీఓ అజార్ మొహియుద్దీన్, ఏపీఎం శివజ్యోతి, పంచాయతీ కార్యదర్శి రమేష్, టీఏ పురేందర్ పాల్గొన్నారు.