అలంపూర్: అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవ శక్తిపీఠమైన అలంపూర్ జోగుళాంబ క్షేత్రం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి చెప్పారు. హైదరాబాద్లోని ప్రజా భవన్లో మంగళవారం రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లంతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై అలంపూర్ క్షేత్ర అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి మహబూబ్గర్ కలెక్టర్గా అజయ్ కల్లం విధులు నిర్వర్తించిన సమయంలో అలంపూర్ ఆలయాల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషిచేశారని గుర్తుచేశారు. క్షేత్రం అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనుల కోసం కమిటీని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ విషయంపై ఇప్పటికే దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ శ్రీధర్తో కలిసి రెండుసార్లు సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ప్రధానంగా ఆలయ ప్రాంగణంలో లైటింగ్, పార్కింగ్, ఆలయ చరిత్రతో కూడిన ప్రచార బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. క్షేత్రంలో అభివృద్ధిలో భాగంగా టూరిజం, అతిథిగృహాల నిర్మాణాలు, ఎవెన్యూ ప్లాంటేషన్, అర్చీల ఏర్పాటు వంటి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 20న మరోసారి సమావేశం నిర్వహించి.. అభివృద్ధి పనులపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు చిన్నారెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం రిటైర్డ్ వైస్ చాన్స్లర్ రాఘవారెడ్డి, రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ, సీడ్స్ గ్రోవర్స్ సంఘం అంతర్జాతీయ అధ్యక్షుడు డా.కేశవులు తదితరులు ఉన్నారు.