భూపాలపల్లి అర్బన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివస్లో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ప్రజల నుంచి 13 ఫిర్యాదులు స్వీకరించి పరిశీలించారు. బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక మోసాలు, ఇతర పోలీస్ సంబంధిత అంశాలపై వినతులు స్వీకరించారు. ప్రతీ ఫిర్యాదును ఓర్పుగా విన్న ఆయన సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని తెలిపారు. ప్రతి ఫిర్యాదును విచారించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


