కాళేశ్వరం: మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం దేవస్థానం జీర్ణోద్ధరణ, రాతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా పాత ఆలయాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మాస్టర్ ప్లాన్కు సంబంధించిన డ్రాయింగ్స్, డ్రాఫ్ట్లు ఇంకా పూర్తికాలేదని సమాచారం. హైదరాబాద్కు చెందిన క్షేత్ర కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరుగుతున్నది. ఇప్పటికే ఆలయ ప్రాకారాలు, పలు ఉప ఆలయాల కూల్చివేతలు తుది దశకు చేరుకున్నప్పటికీ, డ్రాయింగ్స్ ఆలస్యం కావడంతో ఆలయ గర్భగుడి కూల్చివేతను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. దేవాదాయశాఖ స్థపతి వచ్చి గర్భగుడి తొలగింపునకు సంబంధించిన వివరాలు చెప్పి అనుమతి ఇచ్చిన తరువాతనే తొలగింపు కార్యక్రమం జరుగుతుందని తెలిసింది. ఈ పరిణామంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పలువురు భక్తులు కోరుతున్నారు. ఏప్రిల్ 20న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాళేశ్వరం దేవస్థానం అభివృద్ధికి రూ.198 కోట్లు మంజూరు చేసి శంస్థాపన చేసిన విషయం తెలిసిందే. జూన్ 16న దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు గ్రామస్తులతో సమావేశమై మాస్టర్ ప్లాన్పై వివరించారు. మరునాడు శృంగేరిపీఠం శిశ్యులతో కళాప్రకర్షణ చేసి జూన్ 17న ఆదిముక్తీశ్వరాలయంలో బాలాలయంలోకి మార్చి ఉత్సవమూర్తులతో పూజలు ప్రారంభించారు. జూన్ 19న ప్రధాన ఆలయం, అనుబంధ ఆలయాలు, ప్రాకారాల్లో విగ్రహాల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. ఆ విగ్రహాలను పకడ్బందీగా ఎస్సార్ఆర్లో భద్రపరిచారు. అనంతరం జూలై 27న హైదరాబాద్కు చెందిన ఓ కంపెనీకి టెండర్ ఖరారైంది. జూలై 30నుంచి పాత ఆలయ ప్రాకారాలు, ఉప ఆలయాల కూల్చివేతలు ప్రారంభమయ్యాయి.
డ్రాయింగ్, డిజైన్ల జాప్యంపై విమర్శలు..
వచ్చే ఏడాది జూన్ 26నుంచి జూలై 7వరకు గోదావరి నది పుష్కరాలు 12 రోజుల పాటు ఘనంగా నిర్వహించడానికి ఇప్పటికే ప్రభుత్వం ముందు నుంచి పనులపై ఫోకస్ చేస్తున్నారు. అప్పటిలోగా ఆలయ పునర్నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. డ్రాయింగ్స్, ఇతర డిజైన్లలో మరింత జాప్యం జరుగుతుండడంతో నిర్మాణ పనులకు సమయం తగ్గిపోతుందని, పది నెలల సమయం ఉండడంతో పుష్కరాల నాటికి పనులు పూర్తి పైన విమర్శలు వస్తున్నాయి. వివిధ శాఖలకు రూ.88.80 కోట్లతో నిధులు మంజూరు చేయగా, అందులో ఇరిగేషన్శాఖకు రూ.60కోట్లతో అష్టతీర్ధాలకు నిధులు మంజూరు కాగా, టెండరు కావాల్సి ఉంది. ఈవిషయమై ఆర్అండ్బీ డీఈఈ దేవేందర్ను ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.
రూ.198కోట్లతో కాళేశ్వరం
రాతి నిర్మాణానికి గతంలో శంకుస్థాపన
గర్భగుడి తొలగింపునకు స్థపతి అనుమతి
పుష్కరాలకు పది నెలల సమయం మాత్రమే..


