భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని కృష్ణకాలనీ సీఈఆర్ క్లబ్ మినీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సామాజిక చైతన్య నాటకోత్సవాలు ఆకట్టుకున్నాయి. ఆదివారం మూడో రోజున ‘బుద్ధునితో నా ప్రయాణం’ నాటికను హైదరాబాద్కు చెందిన అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ఏరియా ఎస్ఓటు జీఎం డి.శ్యాంసుందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌతమ బుద్ధుడు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం నాటికను ప్రారంభించారు. నాటికలో గౌతమ బుద్ధుని జీవితం, బోధనలు, మానవతా విలువలు, అహింస, శాంతి, కరుణ, సమానత్వం, సత్యం, ఆత్మపరిశీలన వంటి అంశాలను కళాకారులు ఆవిష్కరించారు. రాజభోగాలను త్యజించి మానవాళి బాధలకు పరిష్కారం కోసం సత్యాన్వేషణలో పయనించిన బుద్ధుని జీవిత ప్రయాణాన్ని నాటిక రూపంలో ఆకట్టుకునేలా ప్రదర్శించారు. కోపం, ద్వేషం, హింసలకు దూరంగా ఉండి ప్రేమ, కరుణ, శాంతి మార్గంలో నడవాలనే బుద్ధుడి సందేశం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సమాజంలో శాంతి, సహనం, మానవత్వం పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని నాటిక చాటిచెప్పింది. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి అధికార ప్రతినిధి విశ్రాంత్ కుమార్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేశ్, ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు మధుకర్రెడ్డి, భూపాలపల్లి సీఎంఓఐఏ అధ్యక్షుడు ఎండీ.నజీర్, ఎస్సీ, ఎస్టీ, బీసీ లైజన్ అధికారులు, వివిధ సంఘాల నాయకులు, ఉద్యోగులు, విద్యార్థులు, సేవా సభ్యులు పాల్గొన్నారు.


