● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
గణపురం: జిల్లాలో 8 మండలాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందించడంతో పాటు ఆయకట్టు రైతులకు సాగునీరు అందించేందుకు రామప్ప సరస్సు నుంచి గణపసముద్రం చెరువుకు గోదావరి జలాలను వెంటనే అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదేశించారు. శుక్రవారం గణపురం ఎంపీడీఓమ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో మోకా సర్వే నిర్వహించి అర్హుడైన ప్రతీ రైతుకు పట్టా పాస్ పుస్తకం అందించాలన్నారు. సర్ ప్రక్రియలో ఒక్క ఓటు కూడా నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని ఏఈ వెంకటరమణను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్డీఓ బాలకృష్ణ, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


