● డీటీడీఓ నాగసాగర్
మల్హర్(కాటారం)/కాళేశ్వరం : ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన భోజనం, వసతులు అందేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి నాగసాగర్ సూచించారు. గురువారం కాటారం మండలంలోని మేడిపల్లి, మహదేవపూర్, కాళేశ్వరం ఆశ్రమ ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదులు, వసతి గృహాలు, వంటశాల, మరుగుదొడ్ల పరిశుభ్రతను పరిశీలించారు. బాలికల పాఠశాలల్లో విద్యార్థినులతో నేరుగా మాట్లాడి వారి విద్యాభ్యాసం, భోజనం, వసతులపై అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఎదురవుతున్న సమస్యలపై ఫిర్యాదులు ఏమైనా ఉన్నాయా అని ఆరాతీశారు. మహదేవపూర్ ఆశ్రమ పాఠశాలలో డీటీడీఓ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజన నాణ్యత, కామన్ మెనూపై విద్యార్థుల అభిప్రాయాలు తీసుకున్నారు. అనంతరం నాగసాగర్ మాట్లాడుతూ.. మూడు పాఠశాలల్లో కామన్ మెనూ సక్రమంగా అమలవుతోందని, ఉపాధ్యాయులు రూపొందించిన లెసన్ ప్లాన్స్ సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పారు. ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల మధ్య మంచి సమన్వయం ఉందని, పాఠశాలల్లో సానుకూల వాతావరణం ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లను ఆదేశించారు.


