సరస్వతి అంత్యపుష్కరాలకు ఏర్పాట్లు
కాళేశ్వరం: మే నెలలో వచ్చే సరస్వతినది అంత్యపుష్కరాలకు అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్శర్మ అధికారులను ఆదేశించారు. మే 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరిగే పుష్కరాల పనులపై కాళేశ్వరం దేవాలయ ఈఓ కార్యాలయంలో ఎస్పీ సంకీర్త్, రెవెన్యూ, దేవాదాయ, ఆర్కిటెక్చర్, ఇరిగేషన్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో కలిసి నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతేడాది నిర్వహించిన సరస్వతి ఆది పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని అంత్య పుష్కరాలకు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వసతులు కల్పించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. గత పుష్కరాల్లో ఎదురైన సమస్యలు పునరావృతం కాకూడదన్నారు. అంత్య పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం రూ. 30.16 కోట్ల నిధులను మంజూరు చేసిందని తెలిపారు. ఇందులో రూ.16 కోట్లతో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత శాఖల అధికారులు అంచనాలు తయారుచేసి ప్రతిపాదనలు పంపించాలని వెల్లడించారు. ఫిబ్రవరి మొదటి వారంలోపే టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. కాళేశ్వరం మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా శాశ్వత పనులు చేపట్టాలని, పుష్కరాల సమయంలో భక్తుల రాకపోకలు, భద్రత, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, విద్యుత్ సరఫరా వంటి అంశాల్లో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ సరస్వతి అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు పోలీస్ శాఖ తరఫున పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ట్రాఫిక్ నిర్వహణ, వాహనాల పార్కింగ్, భక్తుల భద్రత వంటి అంశాలపై ముందుగానే ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ధార్మిక సలహాదారు గోవింద హరి మాట్లాడుతూ సరస్వతి అంత్య పుష్కరాలను ఆది పుష్కరాల మాదిరిగానే వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అంత్య పుష్కరాలపై విస్తృత ప్రచారం చేపట్టాలని, పెండింగ్లో ఉన్న దేవాదాయ శాఖ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కాళేశ్వరం క్షేత్రానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసేలా త్వరలోనే శ్రీకాళేశ్వర ఖండంశ్రీ అనే పుస్తకాన్ని విడుదల చేస్తామన్నారు.ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ మాయంక్ సింగ్, డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ వెంకటేశ్వర్లు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రూ.30.61 కోట్లు
మంజూరుచేసిన ప్రభుత్వం
రూ.16 కోట్లతో శాశ్వత పనులు
పనులపై అధికారులతో
కలెక్టర్ రాహుల్శర్మ సమీక్ష


