ఇసుక అక్రమ రవాణా కట్టడికి చర్యలు
భూపాలపల్లి: జిల్లాలో ఇసుక అక్రమ రవాణా నిరోధానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ వెల్లడించారు. ఇసుక అక్రమ రవాణాపై చేపట్టాల్సిన చర్యలపై మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, రవాణా, టీజీఎండీసీ తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి గతంలో మాన్యువల్ కూపన్ల ద్వారా ఉచితంగా ఇసుక అందించామని, ఇకపై ఆ విధానాన్ని పూర్తిగా నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక నుంచి ఇసుక అవసరమైన లబ్ధిదారులు తప్పనిసరిగా ‘మన ఇసుక వాహనం’ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ విధానం ద్వారా ఇసుక పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని అన్నారు. త్వరలోనే తహసీల్దార్లు, టీజీఎండీసీ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలపై విశ్లేషణ చేస్తామన్నారు. జిల్లాలోని ఇసుక రీచ్లను గుర్తించేందుకు ఇరిగేషన్, టీజీఎండీసీ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ట్రాన్స్పోర్ట్ అధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టి ఓవర్ లోడింగ్లను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక అక్రమ రవాణా, అక్రమ నిల్వలు, అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఎస్పీ సంకీర్త్ మాట్లాడుతూ.. జిల్లాలోని వాగుల నుంచి అక్రమంగా ఇసుక తరలించినా, అక్రమ డంప్లు ఏర్పాటు చేసినా చర్యలు తప్పవన్నారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిరంతర తనిఖీలు చేపడుతున్నామని, చెక్పోస్ట్ల వద్ద మరింత నిఘా పెంచుతామన్నారు. ఈ సమావేశంలో డీఎఫ్ఓ నవీన్రెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, డీటీఓ సంధాని, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్


