
స్థానిక పోరుపై నజర్!
కాళేశ్వరం: పంచాయతీరాజ్, రెవెన్యూశాఖల మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వేర్వేరుగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని పేర్కొనడంతో పల్లెల్లో ఆశావహుల సందడి నెలకొంది. ఈనెల చివరన లేదా వచ్చే నెలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు ఇప్పటికే సర్వం సిద్ధం చేసినట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లు తేలిన తరువాతనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది.
అధికారులు సిద్ధం..
పంచాయతీ పోరుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అధికార యంత్రాంగం కూడా ఏర్పాట్లు పూర్తి చేసింది. దీంతో ఆశావహులు కూడా స్థానిక పోరుపై నజర్ వేశారు. దానికి అనుగుణంగానే పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఏవి ముందుగా వచ్చినా అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టారు. జిల్లాలో 241 పంచాయతీలు, 2,044 వార్డులు, 12 జెడ్పీటీసీ, 106 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. భూపాలపల్లిలో మున్సిపాలిటీ ఉంది. 2,044 వార్డులు, 2,044 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 2,91,663మంది ఓటర్లు ఉన్నారు. 2024 ఫిబ్రవరి 1న సర్పంచులు, జూన్ 31న ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, ఆగస్టు నెలలో మున్సిపాలిటీల పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది.
ఊహల్లో ఆశావహులు..
ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో గ్రామ, మండలస్థాయిలో కష్టపడిన ఆయా పార్టీల నాయకులు ఇప్పుడు తమ లక్ష్యమంతా స్థానిక సంస్థల్లో పోటీ చేయడమే అని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ప్రకటన రావడమే తరువాయి అన్న చందంగా పంచాయతీల్లో నిత్యం ప్రజల సమస్యలను ఆలకిస్తున్నారు. ముఖ్యంగా గ్రామస్థాయిలో సర్పంచ్కు పోటీచేసే విషయంలో ఈ సారి గట్టి పోటీయే కనపడుతోంది. మూడు ప్రధాన పార్టీల మద్దతు, స్వతంత్రంగా బరిలో నిలవాలనుకునే వారు ఆశల లోకంలో విహరిస్తున్నారు. గతంలో పోటీచేసి ఓడిపోయిన వారితోపాటు కొత్తవాళ్లు, యువత ఎక్కువగా ఈ పదవిపై కన్నేస్తున్నారు. ఇందుకోసం ఏ పార్టీ మద్దతు ఉంటే తమకు లాభం ఉంటుందనే విషయంపై ఆలోచిస్తున్నారు. గ్రామాల్లో ఇప్పటికే పార్టీలు, దావత్లతో కిక్కెస్తున్నారు. అధికార పార్టీ ఇప్పటికే పంచాయతీల వారీగా సంస్థాగత ఎన్నికల పరిశీలకులను నియమిస్తుంది. దీంతో గ్రామాల్లో గ్రూపు రాజకీయాలు, తగాదాలు లేకుండా సమన్వయ పరుస్తుంది.
మంత్రి మాటలతో..
మంత్రి పొంగులేటి వ్యాఖ్యలతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ముందు నిర్వహించి, ఆ తరువాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం చూస్తున్నట్లు తెలిసింది. కొన్ని రోజులుగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలపై కన్నేసిన నాయకులు ఇప్పటికే తమ బలాలను చూపించుకుంటున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అతి మర్యాదలు చేస్తున్నారు. తమ పార్టీ ముఖ్యులను కలుస్తూ తమ అభ్యర్థిత్వాన్ని తెలుపుతున్నారు. ఎమ్మెల్యే, మంత్రుల స్థాయిలో అనుకూల రిజర్వేషన్లపై చర్చిస్తున్నట్లు తెలిసింది. బీసీ రిజర్వేషన్పై పార్టీ పరంగా 42శాతమా లేదా చట్టబద్ధంగా 42శాతం రిజర్వేషన్ కల్పించాలా అనే చర్చ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కులగణన కూడా పూర్తిచేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి సమర్పించింది. దీంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఎన్నికలు నిర్వహించనున్నారని తెలిసింది. దీంతో పల్లెల్లో ఆశావహుల్లో సందడి వాతావరణం కనిపిస్తుంది.
జిల్లాలో 241 గ్రామపంచాయతీలు
12 జెడ్పీటీసీ, 106 ఎంపీటీసీ స్థానాలు
బీసీ రిజర్వేషన్ తేలిన తర్వాతనే
ఎన్నికలకు ప్రభుత్వం?
పల్లెల్లో జోరందుకున్న
ఆశావహుల సందడి
హీటెక్కుతున్న గ్రామాలు