
యువత మత్తుకు దూరంగా ఉండాలి
కాళేశ్వరం: యువత గంజాయి, గుడుంబా లాంటి మత్తుకు దూరంగా ఉండాలని, భవిష్యత్ నాశనం చేసుకోవొద్దని కాటారం డీఎస్పీ ఎ.సూర్యనారాయణ అన్నారు. ఆయన గురువారం మహదేవపూర్ పోలీస్స్టేషన్లో బాధ్యతలు చేపట్టిన తరువాత విలేకర్ల సమావేఽశం నిర్వహించారు. డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ ఈ నెలలో మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరి నీటిలో మునిగి మృతి చెందిన ఆరుగురు మృతుల కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేశారు. ఆ బ్యారేజీ ప్రాంతంలో సూచిక, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. గోదావరిలోకి ఈతకు వెళ్లొద్దని, చేపలు పట్టే జాలర్లు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. జాతీయ, రాష్ట్ర రోడ్ల మీద పశువులను విడిచిపెట్టవద్దని.. అలా చేస్తే వాటిని గ్రామపంచాయతీ ద్వారా స్వాధీనం చేసుకొని గోశాలకు తరలిస్తామన్నారు. ట్రాక్టర్లు, బైకులు, ఇతర మోటార్ వాహనాలను మైనర్లకు ఇవ్వొద్దని, ఒకవేళ ఇస్తే తల్లిదండ్రులు, వాహన యజమానులపై కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. వారిని కోర్టులో హాజరు పరుస్తామన్నారు. గంజాయి సేవించే వారిపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహదేవపూర్ సీఐ రామచందర్రావు, మహదేవపూర్ ఎస్సై 2 నాందేవ్, పీఎస్సై సాయిశశాంక్ పాల్గొన్నారు.
మేడిగడ్డ వద్ద హెచ్చరిక,
సూచిక బోర్డుల ఏర్పాటు
మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు
కాటారం డీఎస్పీ సూర్యనారాయణ