
ఫీజుల దోపిడీని అరికట్టాలి
భూపాలపల్లి అర్బన్: ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు సొత్కు ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోని సూపరింటెండెంట్ రాజయ్యకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ప్రవీణ్కుమార్, జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్లు మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, పాఠశాలలోనే పుస్తకాలు, యూనిఫాం విక్రయిస్తూ అక్రమంగా లక్షల రూపాయలను దోచుకుంటున్నారన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో పేదలకు 25 శాతం ఉచిత విద్యను అమలు చేయాలన్నారు. పాఠశాలలపై తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు కునూరి భగత్, మేడి శేఖర్, అజయ్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.