
ఉచిత శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి రూరల్: యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రవేశానికి హైదరాబాద్లో ఉచిత శిక్షణకు జిల్లాలోని డిగ్రీ పూర్తి చేసిన షెడ్యూల్డ్ కులాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారిణి సునీత బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల వారు టీఎస్స్టడీ సర్కిల్.కో.ఇన్ వెబ్సైట్లో జూలై 17వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ప్రతీ రైతుకు ‘రైతు భరోసా’
భూపాలపల్లి రూరల్: పాత రైతులతో పాటు నూతనంగా పట్టా పాస్బుక్కులు పొందిన రైతులకు కూడా రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినట్లు కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. బుధవారం కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ వరకు అర్హులైన ప్రతీ రైతుకు రైతు భరోసా అందిస్తామన్నారు. జిల్లాలో 282 గ్రామాల నుంచి 1,24,397 మంది రైతులకుగాను రూ.143,99,06,145 నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉందన్నారు. ఇందులో రూ. 114,50,67,074 నిధులు ఖజానా ద్వారా విడుదల అయ్యాయన్నారు. ఇప్పటి వరకు 90,837 మంది రైతులకు రూ.72,30,42,624 నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయన్నారు. మిగతా రైతులకు ఈనెల 20వ తేదీలోపు జమ అవుతాయన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో రైతు భరోసా సమర్థవంతంగా కొనసాగుతుందన్నారు.
ఫర్టిలైజర్ షాపుల తనిఖీ
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలంలోని పలు గ్రామాల్లో విత్తనాలు, ఫర్టిలైజర్ షాపుల్లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరునాయక్, ఏఓ సతీష్ తనిఖీలు చేపట్టారు. బుధవారం కొంపెల్లి, గుడాడ్పల్లి, గోర్లవీడు, వజినపల్లి, నేరేడుపల్లి గ్రామాల్లో షాపుల్లో రికార్డులను పరిశీలించారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు విక్రయించాలని, తప్పకుండా రశీదు ఇవ్వాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని యజమానులకు సూచించారు. తనిఖీల్లో వ్యవసాయశాఖ అధికారులు, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.
ఉద్యాన పథకాలపై
అవగాహన ఉండాలి
చిట్యాల: మండలంలోని జూకల్ రైతువేదికలో ఉద్యాన పథకాలపై రైతులకు బుధవారం అవగాహన, శిక్షణ శిబిరం ఏర్పాటు చేసినట్లు ఉద్యాన శాఖ జిల్లా అధికారి ఏ.సునీల్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వివిధ రకాల ఉద్యాన పథకాలు, వాటి అర్హత ప్రమాణాలు రాయితీ ఏవిధంగా ఇస్తున్నారో అవగాహన కల్పించారు. పండ్ల తోటల పెంపకం, కూరగాయల పందిరి, ఉద్యాన యాంత్రికరణ, ఆయిల్పామ్ సాగు, డ్రిప్, స్ప్రింకర్ల వంటివాటిపై అవగాహన కల్పించారు. ఉద్యాన సాగులో శాసీ్త్రయ యాజమాన్య పద్ధతులు, కొత్త పద్ధతుల ప్రాముఖ్యం, నవీన సాంకేతికత వినియోగంపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి దీపక్, ఓరుగల్లు ఎఫ్పీఓ డైరెక్టర్ సమ్మిరెడ్డి, దుబాసి నర్సయ్య, వెంకటేశ్వర్లు, ఆయిల్ ఫామ్ ప్రతినిధులు అరవింద్, సాయి, ప్రీతం, మారి సంస్థ ప్రతినిధి కళ్యాణ్, డ్రిప్ కంపెనీ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
జనరల్ స్థానాల్లో
బీసీలు పోటీ చేయాలి
మొగుళ్లపల్లి: ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో 2023 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీ జనరల్ స్థానాల్లో బీసీలు పోటీ చేయాలన్నారు. బీసీల ఓట్లు బీసీలకు వేసుకుంటే రాజ్యాధికారం మన చేతిలో ఉంటుందన్నారు. పార్టీలకతీతంగా బీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు.

ఉచిత శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ