
వరుణ దేవుడా..కరుణించూ..
భూపాలపల్లి రూరల్: జిల్లాలో వర్షాధార పంటలు సాగు చేసే రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ముందస్తుగా మురిపించిన వరుణుడు ప్రస్తుతం ముఖం చాటేశాడు. ఈ ఏడాది రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయని, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో రైతులు సంతోషపడ్డారు. ఈ క్రమంలోనే జిల్లాలోకి నైరుతి పవనాలు ముందుగానే ప్రవేశించడంతో తొలకరి జల్లులు పడ్డాయి. మే నెల చివరివారంలో వర్షాలు విస్తారంగా కురవడంతో రైతులు పొలంబాట పట్టారు. దుక్కులు దున్ని.. ఎరువులు, విత్తనాలు సిద్ధం చేసుకోగా.. సుమారుగా 36వేల ఎకరాల్లో పత్తి విత్తనాలు విత్తారు. విత్తనాలు మొలకెత్తే దశలో ఉండగా.. వరుణుడు ముఖం చాటేచేయడంతో నీరు అందక.. మొలకలను భూమిపై మొచి పెంచుకోవడానికి రైతులు నానాతంటాలు పడుతున్నారు. వాన జాడ లేకపోవడంతో రైతులకు ఆదిలోనే కష్టాలు ఆరంభమయ్యాయి. ఎండలు భగ్గుమంటుండటంతో.. మొలకలు వాడిపోకుండా నీటి సౌకర్యం ఉన్న రైతులు నీటిని అందిస్తూ కాపాడుకుంటున్నారు. విత్తనాలు నాటని రైతులు విత్తనాలు వేయాలా?వద్దా? అనే అయోమయంలో ఉన్నారు.
పత్తికే ప్రాధాన్యం..
ప్రతీఏడాది జిల్లాలో వరి తర్వాత స్థానం పత్తి పంటదే ఉంటుంది. మార్కెట్లో పత్తి పంటకు గిట్టుబాటు ధర పలకకఽపోయినా, లాభాలు రాకున్న పెట్టుబడి మాత్రం వస్తుందనే నమ్మకంతో పత్తి పంటకు ప్రాధాన్యం ఇస్తారు. జిల్లాలో 93,823 ఎకరాల్లో పత్తిసాగుకు అధికారులు అంచనా వేయగా, ఇప్పటి వరకు సుమారుగా 36 వేల ఎకరాల్లో సాగైనట్లు అధికారులు చెబుతున్నారు.
భూమిలోనే మాడిపోతున్నాయి..
వర్షాకాలం ఎంత త్వరగా విత్తనాలు వేస్తే అంత మంచిదని, చీరపీడలు, ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా పంటలు చేతికి వస్తాయని రైతుల నమ్మకం. అందుకే జూన్ నెల ప్రారంభం నుంచే విత్తనాలు వేస్తారు. రోహిణి కార్తెలో వరి నార్లు పోస్తారు. అయితే ఈ ఏడాది మే నెల చివరి వారంలోనే తొలకరి వర్షాలు కురిశాయి. కానీ, జూన్ నెలలో కురవాల్సిన వర్షాలు ఇప్పటి వరకు జాడ లేదు. మృగశిర కార్తెలోనైనా వరుణుడు కరుణించక పోతాడా అని ఆశిస్తున్నారు.
ఇంకా సమయం ఉంది..
పెద్దవానలు కురిస్తేనే భూమిలో తేమ శాతం పెరుగుతుంది. అప్పుడు విత్తనాలు నాటుకుంటే మొలకెత్తుతాయి. జూలై 20వ తేదీ వరకు వరకు పత్తి విత్తనాలు వేసుకునేందుకు సమయం ఉంది. ఇప్పటి వరకు 40 శాతం భూమిలో రైతులు పత్తి విత్తనాలు నాటారు. మిగతా రైతులు ఆశించిన మేర వర్షాలు కురిసిన తర్వాతే విత్తనాలు నాటుకోవాలి.
– వీరునాయక్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
పంటల సాగు వివరాలు (ఎకరాల్లో..)
పంటలు అంచనా సాగు
వరి 1,12,218 నారు దశ
పత్తి 93,823 36,000
మిర్చి 28,000 ––––
ఈ ఫొటోని రైతు జంగేడు గ్రామానికి చెందిన దొంగల రమేశ్. మేనెల చివరివారంలో కురిసిన వర్షాలకు ఎకరంన్నర భూమిలో పత్తివిత్తనాలతో పాటు పెసర పంట వేశాడు. అప్పటి నుంచి వర్షాలు కురవకపోవడంతో పత్తి, పెసర మొలకలు మొలవలేదు. ఆశతో మొలకలు మొలుస్తాయోనని రోజూ తోటకు వచ్చి చూసి వెళ్తున్నాడు. వర్షాలు కురవడం లేదు.. మొలకలు రాకపోవడంతో దీనంగా ఆకాశంవైపు చూస్తున్నాడు. ఇలా జిల్లాలో చాలామంది రైతులు పత్తి విత్తనాలు నాటి.. వర్షాల కోసం ఆకాశంవైపు చూస్తున్నారు.
జాడలేని వానలు
తొలకరి వర్షాలకే
విత్తనాలు విత్తిన రైతులు
ఇప్పటికే 36వేల ఎకరాల్లో పత్తి సాగు
గ్రామాల్లో కప్పతల్లికి పూజలు
పంటను కాపాడుకునేందుకు
అన్నదాతల కష్టాలు
వర్షాలు కురవాలని కప్పతల్లి ఆట
చిట్యాల: వర్షాకాలం మొదలైన ఇప్పటి వరకు సరైన వర్షాలు కురవకపోవడంతో మండలంలోని ముచినిపర్తి గ్రామస్తులు బుధవారం క ప్పతల్లి ఆట ఆడారు. అనంతరం గ్రామదేవతలకు జలాభిషేకం చేశారు. వర్షాలు అధికంగా కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని పూజలు చేశారు. గ్రామస్తులు పాపిరెడ్డి, రవీందర్, చంద్రమౌళి, రమణకుమార్, రాజు, రా జన్న, తిరుపతి, రాజు తదితరులు ఉన్నారు.

వరుణ దేవుడా..కరుణించూ..

వరుణ దేవుడా..కరుణించూ..

వరుణ దేవుడా..కరుణించూ..