
‘భూ భారతి’తో ప్రజలకు మేలు
చిట్యాల: భూ భారతి చట్టంతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూ భారతి చట్టంపై మంగళవారం మండలకేంద్రంలోని రైతు వేదికలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్శర్మ హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ ధరణి స్థానంలో తెచ్చిన భూ భారతి చట్టం రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం ఉంటుందని అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ ఉందన్నారు. ఽగత ప్రభుత్వంలో ధరణిలో అప్పీలు చేయడానికి అవకాశం లేదని సివిల్ కోర్టుకు వెళ్లాల్సి ఉండడం వల్ల పది సంవత్సరాలు ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. రెవెన్యూ వ్యవస్థకు తీరని కళంకం తెచ్చారన్నారు. వచ్చే నెలలో మన జిల్లాలో ఒక మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికచేసి భూ భారతి చట్టంపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నట్లు తెలిపారు. జూన్ 2నుంచి చట్టం అమలులోకి రానున్నట్లు పేర్కొన్నారు. భూమి ఉన్న ప్రతి ఒక్కరికి హక్కులు కల్పిస్తామని అవినీతి రహిత సేవలు అందిస్తామని అన్నారు. అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. భూ భారతి చట్టంతో రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక మార్పునకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. భూ భారతి చట్టంలో రూల్స్ ఫ్రేమ్ చేశారని అన్నారు. అనంతరం నవాబుపేట, మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీఓ రవి, తహసీల్దార్ హేమ, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి–సత్యం పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర
సత్యనారాయణరావు