
డీజీపీఎస్ పరికరంతో సర్వే వేగిరం
భూపాలపల్లి: సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు డీజీపీఎస్ పరికరం సహకరిస్తుందని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో రూ.16.78 లక్షల విలువ గల డిజిటల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (డీజీపీఎస్) పరికరాన్ని సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కుసుమకుమారికి కలెక్టర్ అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సాంకేతికత వినియోగంతో సర్వే ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయవచ్చన్నారు. జిల్లాలో పరిశ్రమలు, రహదారుల నిర్మాణం, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తిచేయడానికి డీజీపీఎస్ పరికరం ఉపయోగపడుతుందని తెలిపారు. సిబ్బందికి ఇది మరింత సౌలభ్యాన్ని కలిగిస్తుందని, ప్రాధాన్యతను గుర్తించి సర్వేలో వేగం పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమకుమారి, సిబ్బంది పాల్గొన్నారు.
పంట నష్టం నివేదిక అందజేయాలి..
అకాల వర్షాలకు దెబ్బతిన్న వ్యవసాయ, వాణిజ్య పంటల నివేదిక అందజేయాలని కలెక్టర్ రాహుల్శర్మ వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటల నివేదిక రూపకల్పనపై ఐడీఓసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... పంట నష్టం అంచనాలు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి పకడ్బందీగా నమోదు చేయాలన్నారు. రైతులకు పరిహారం అందజేసేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఏఓ వీరునాయక్, జిల్లా ఉద్యానవన శాఖాధికారి సునీల్కుమార్ పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ